ధోని కోసమేనా.. ఐపీఎల్‌ అన్‌క్యాప్డ్ రూల్‌ పై వివాదం

ధోనీ ఐపీఎల్‌లో మరొక సీజన్ ఆడటానికి బీసీసీఐ ప్రత్యేకంగా అన్‌క్యాప్డ్ రూల్‌ను తెచ్చిందన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అన్‌క్యాప్డ్ నిబంధన ప్రకారం, గత అయిదేళ్లలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడని ఆటగాడు అన్‌క్యాప్డ్ కేటగిరీలోకి వస్తాడు. ఇది 2008లో ప్రవేశపెట్టినప్పటికీ, 2021లో రద్దయ్యింది. అయితే, ఈ ఏడాది 2025-27కి సంబంధించిన కొత్త నిబంధనలలో మళ్లీ దాన్ని తీసుకొచ్చారు.

ఈ నిబంధనపై అభిమానులు, విశ్లేషకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ధోనీని ఇంకో సీజన్ కొనసాగించడానికే ఈ రూల్ తీసుకువచ్చారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తాజాగా స్పందిస్తూ, ఈ రూల్ ధోనీ కోసం మాత్రమే కాదని, పీయూష్ చావ్లా, అమిత్ మిశ్రా వంటి సీనియర్ ఆటగాళ్లకు సైతం లాభదాయకమని తెలిపారు.

ప్రస్తుతం వస్తున్న వార్తలను వీటిని ఖండిస్తూ, ఐపీఎల్‌లో ధోనీ స్థాయి ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ అయినా ధరతో సంబంధం లేకుండా కూడా తీసుకుంటుందని తెలిపారు. ‘‘ధోనీకి ఉన్న వ్యూహాత్మక దృష్టి ఎవరితోనూ పోల్చలేనిది. అతడి జ్ఞానం టీమ్ ప్లానింగ్‌లో అమూల్యమైనది’’ అని ధుమాల్ అభిప్రాయపడ్డారు.

ఈ రూల్ ఇతర సీనియర్ ఆటగాళ్లకు కూడా మద్దతు ఇస్తుందని, వారు ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నారని తెలిపారు. ఐపీఎల్ వేలంలో క్యాప్డ్ ఆటగాళ్లకు రూ.11 కోట్లు, అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు రూ.4 కోట్లు రిటైన్ ఫీజు ఉన్నందున, ఈ నిబంధన ఫ్రాంచైజీలకు ఆర్థికంగా కూడా ప్రయోజనం కలిగిస్తుందని ధుమాల్ పేర్కొన్నారు.