కోహ్లీపై ఇంత కామెడీనా?

భారత క్రికెట్ అనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు విరాట్ కోహ్లి. టీమ్ ఇండియా కెప్టెన్‌గానూ అనేక ఘనతలు సాధించాడు. టెస్టుల్లో భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ అతనే. ఆ ఫార్మాట్లో జట్టును ప్రపంచ నంబర్‌వన్‌గానూ నిలబెట్టాడు. వన్డేలు, టీ20ల్లో ప్రపంచకప్‌లు గెలిపించకపోయినా మంచి విజయాలే అందించాడు.

కానీ ఐపీఎల్‌‌కు వచ్చేసరికి విరాట్ ఒక విఫల కెప్టెన్‌గా మిగిలిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పటిదాకా అతను పూర్తి స్థాయిలో పది సీజన్లు జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ ఒక్కసారి కూడా కప్పు గెలిపించలేకపోయాడు. అతడి నాయకత్వంలో జట్టు రెండుసార్లు ఫైనల్ చేరింది. కానీ కప్పు కొట్టలేకపోయింది. ఐతే కప్పు గెలవడం సంగతటుంచితే కొన్నేళ్లుగా ప్లేఆఫ్ చేరడం కూడా చాలా కష్టమైపోతోంది. గత మూడు సీజన్లలోనూ తొలి దశలోనే నిష్క్రమించింది.

ఈ సీజన్లో అతి కష్టం మీద ప్లేఆఫ్ అయితే చేరింది కానీ.. అక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. శుక్రవారం సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కుప్పకూలిన జట్టు ఓటమి మూటగట్టుకుంది. ఈ ప్రదర్శన చూశాక ఈ మాత్రం దానికి లీగ్ దశలోనే నిష్క్రమించినా పోయేది.. ప్లేఆఫ్ చేరి లాభమేంటి అంటూ అభిమానులు నిట్టూరుస్తున్నారు. మామూలుగానే ఆర్సీబీ మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. ‘ఈ సాలా కప్ నమదే’ (ఈ సంవత్సరం కప్పు మనదే) అనే ఆర్సీబీ స్లోగన్ మీద ఇప్పటిదాకా ఎంత ట్రోలింగ్ జరిగిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు దీన్ని పట్టుకుని మరింతగా ట్రోల్ చేస్తున్నారు.

నిన్న రాత్రి ఆర్సీబీ ఓడటం ఆలస్యం సోషల్ మీడియాలు ట్రోల్స్, మీమ్స్ హోరెత్తించేశాయి. Play bold అనే ఆ జట్టు మరో స్లోగన్‌ను Play BoLLLLLd (చివరి ఐదు మ్యాచుల్లోనూ ఓడిన నేేపథ్యంలో) అని మార్చి ఒక నెటిజన్ పోస్ట్ చేశాడు. ఇక ఆర్సీబీ మీద వచ్చిన ‘అస్సాం’ జోకులకైతే లెక్కే లేదు. కోహ్లీని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో చాలా మేటి బ్యాట్స్‌మన్‌గా, మంచి కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న విరాట్.. ఐపీఎల్‌లో ఇలా కామెడీ అయిపోతుండటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఒకే జట్టుతో ఉంటూ పదేళ్లుగా కెప్టెన్సీ చేస్తున్న విరాట్.. సరైన జట్టును బిల్డ్ చేయలేకపోవడం, ఆర్సీబీకీ టీం తత్వాన్ని తీసుకురాలేకపోవడం, నిలకడగా విజయాలు సాధించలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.