ఈ ‘శంకర్ దాదా’కు కోటా సీటు కావాలట!

మెగా స్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమా గుర్తుంది కదా. చదువుకునే వయసు ముగిశాక శంకర్ దాదా వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీలో తనదైన మార్కు ప్లాన్ తో సీటు సాధించాడు. అదంతా రీల్ జీవితం అయితే… ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ ఓ శంకర్ దాదా వైద్య విద్య చదివేందుకు ఓ రేంజి ప్రయాస పడుతున్నాడు. 70 ఏళ్ల వయసులో ఆయన ఎంబీబీఎస్ చదివేందుకు ఇటీవలే నీట్ పరీక్ష రాశారు. వృద్దుడిగా నీట్ రాసిన ఈ శంకర్ దాదా… సీనియర్ సిటిజన్ కోటా అంటూ పెట్టి… అందులోనే తనకు ఎంబీబీఎస్ సీటు ఇవ్వాలంటూ ఏకంగా హైకోర్టుకే ఎక్కేశారు.

అమితాసక్తి రేపుతున్న ఈ శంకర్ దాదా గురించిన వివరాల్లోకి వెళితే… మధ్య ప్రదేశ్ కు చెందిన అశోక్ బహార్ వయసు ప్రస్తుతం 71 ఏళ్లు. బహార్ ను డాక్టర్ గా చూడాలని ఆయన తల్లి కోరుకున్నారట. తల్లి కోరిక మేరకు ఇంటర్ పూర్తి కాగానే.. ఎంబీబీఎస్ సీటు కోసం 1974లోనే ప్రవేశ పరీక్షకు హాజరయ్యారట. అయితే నాడు ఆయనకు సీటు రాలేదు. ఆ తర్వాత దాని గురించి ఆయన అంతగా పట్టించుకోలేదట. అయితే ఇప్పుడు వయసు ఉడిగిన సమయంలో 2023లో నీట్ పరీక్ష రాయాలని తీర్మానించారు. నీట్ రాసేందుకు వయో పరిమితి లేని కారణంగా నీట్ కు దరఖాస్తు చేసుకున్న అశో్క్ 2023లో ఒక్క నిమిషం నిబంధనతో పరీక్ష రాయలేకపోయారు.

తాజాగా 2026 నీట్ కూ అప్లై చేసుకున్న అశోక్…ఎంబీబీఎస్ సీటు కోసం పెద్ద యుద్ధమే మొదలెట్టేశారు. నీట్ ఫలితాలు రెండు రోజుల క్రితం విడుదల కాగా.. ఎలాగైనా ఎంబీబీఎస్ సీటు సాధించాలన్న లక్ష్యంతో ఆయన వ్యూహాత్మకంగా కదిలారు. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో్ ఆయా వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లే.. సీనియర్ సిటిజన్లకూ 1 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన నేరుగా అలహాబాద్ హైకోర్టునే ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు పరిదిలోని లక్నో బెంచ్ లో దాఖలైన ఈ పిటిషన్ పై ఈ నెల 21న విచారణ జరగనుంది. మరి ఈ విచారణలో అశోక్ కు ఏ మేర న్యాయం జరుగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.