నన్నొకడు మోసం చేసి సీఎం అయ్యాడు-మోహన్ బాబు


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరెత్తితే చాలు మంటెత్తిపోతారు సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబు. ఒకప్పుడు బాబుతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించిన ఆయన.. ఆ తర్వాత ఆయనకు దూరమయ్యారు. ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. గత కొన్నేళ్లలో బాబు పేరెత్తితే చాలు మోహన్ బాబు తిట్ల వర్షం కురిపించేస్తున్నారు.

గత ఏడాది ఎన్నికల ముంగిట తన విద్యా నికేతన్ సంస్థకు ఫీజు రీఎంబెర్స్‌మెంట్ బకాయిలను బాబు సర్కారు ఉద్దేశపూర్వకంగా ఆపిందంటూ ఆయన రోడ్డెక్కి ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా బాబు ప్రభుత్వానికి వ్యతరిేకంగా, వైకాపాకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఎన్నికల్లో బాలు ఘోర పరాభవం పాలై వైకాపా గెలవడంతో ఆయన శాంతించారు.

ఐతే కొంచెం గ్యాప్ తర్వాత మోహన్ బాబు మరోసారి చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారు. వినాయక చవితి సందర్భంగా ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన రాజకీయ ప్రయాణం గురించి ప్రశ్నించగా.. చంద్రబాబు పేరెత్తకుండా ఆయనపై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు.

‘‘ఒకడి వల్ల నా రాజకీయ జీవితం నాశనమైంది. అతణ్ని నమ్మి రాజకీయాల్లోకి దిగాను. నన్ను మోసం చేసి అతను ముఖ్యమంత్రి అయ్యాడు. కలిసి వ్యాపారం మొదలుపెడితే అందులోనూ మోసం చేశాడు. వేల కోట్లకు పడగలెత్తాడు. కానీ అతను వేల కోట్లు సంపాదించడం.. నేను ఇప్పుడున్న స్థితిలో ఉండటం రెండూ ఒకటే. ఆ వ్యక్తి చేసినవన్నీ మరిచిపోయి రాజీకి వెళ్లాలని కొందరంటారు. కానీ కాకా పట్టేవాళ్లు అలా అంటారు కానీ.. నేను అంతా ఎలా మరిచిపోతాను’’ అని మోహన్ బాబు అన్నారు.

తెలంగాణలో పాలన గురించి అడిగితే కేసీఆర్, కేటీఆర్ కలిసి అద్భుతంగా చేస్తున్నారని అన్న మోహన్ బాబు.. కేంద్రంలో పరిపాలన చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. కొందరు ఈ విషయం చెబితే కాకా పడుతున్నానని అంటారని.. కానీ మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే వెళ్లి కలిశానని.. ప్రధాని అయ్యాక కూడా కలుస్తున్నానని.. తాను ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా ప్రధాన మంత్రి కార్యాలయం ఇస్తుందని.. మోడీ తనను ‘బడా బాయ్’ అని సంబోధిస్తారని మోహన్ బాబు చెప్పారు.