ప‌వ‌న్ ఫ్యాన్స్ కు కూడా షాకిచ్చిన జ‌గ‌న్ స‌ర్కారు

మునెపెన్న‌డూ లేని విధంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చెందిన భీమ్లానాయ‌క్‌ సినిమా ఫ్యాన్స్ తో పాటుగా రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వగా ఏపీలో ఈ మేర‌కు వెసులుబాటు ద‌క్క‌లేదు. అయితే, తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు.

దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీకి వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారు షాక్ ఇచ్చింది. కేసీఆర్‌ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సీఎం సర్ అంటూ ప‌వన్‌ ఫ్యాన్స్ త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వంగవీటి మోహనరంగా, పవన్ కళ్యాణ్ చిత్రపాటలతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.  

ఫ్లెక్సీ ఏర్పాటు కేవ‌లం విజయవాడలో మాత్ర‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. స‌హ‌జంగానే దీనికి రాజ‌కీయాలు ముడిపెట్టి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ను ప్ర‌స్తావిస్తూ ఇరుకున ప‌డేశారు. ఈ నేప‌థ్యంలో అధికారులు రియాక్ట‌య్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్న ఫ్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు.

విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీతో పాటుగా ఇత‌ర ప్రాంతాల్లోని ఫ్లెక్సీల‌ను సైతం తొల‌గించారు. కాగా, పవన్ ఫ్లెక్సీల తొల‌గింపుపై అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే భీమ్లానాయ‌క్ కు నిబంధ‌న‌ల విష‌యంలో షాకిచ్చిన ఏపీ స‌ర్కారు ఇప్పుడు ఫ్లెక్సీల తొల‌గింపు రూపంలో ఫ్యాన్స్ కు సైతం షాకిచ్చార‌ని చెప్తున్నారు.