కాపుల్లో ఆధిపత్య గొడవలు?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు మొదలయ్యాయి. కాపులకు రాజ్యాధికారం దక్కాలనే డిమాండ్ ఎప్పటినుండో వినిపిస్తున్నదే. ఇదే విషయమై ఇప్పటికి కాపుల్లోని ప్రముఖులతో చాలా సమావేశాలే జరిగాయి. అయితే సమావేశాలు సమావేశాల్లాగే మిగిలిపోయాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇపుడు కాపు ప్రముఖుల మధ్య సమావేశాలు మొదలయ్యాయి. గడచిన నెలరోజుల్లో మూడుసార్లు సమావేశమయ్యారు.

ఇక్కడే అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. అదేమిటంటే కాపులకు నాయకత్వం వహించేందుకు పోటీ మొదలైనట్లే అనుమానంగా ఉంది. వైజాగ్ లో టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. అలాగే విజయవాడలో వంగవీటి రాధా స్పీడయ్యారు. కాకినాడలో ముద్రగడ పద్మనాభం కేంద్రంగా రాజకీయాలు స్పీడయ్యాయి.

ఇదే సమయంలో మాజీమంత్రి, కాపునేత హరిరామ జోగయ్య జోక్యం పెరిగిపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉండగా కాపులకు మరో పార్టీ ఎందుకంటు గోల మొదలుపెట్టారు. జనసేన ఉన్నంతవరకు కాపులకు ప్రత్యేకంగా వేరే పార్టీ అవసరమే లేదని కూడా చెప్పారు. పైగా హైదరాబాద్ లో సమావేశమైన కాపు నేతల్లో ఎవరికీ సామాజికవర్గాన్ని లీడ్ చేసేంత సీన్ లేదని కూడా తేల్చేశారు.

ఇంతకీ హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నదెవరు ? ఎవరంటే గంటా, రాధా, జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు అండ్ కో. సమావేశంలో పాల్గొన్నవాళ్ళని చూస్తే మటుకు జోగయ్య చెప్పింది నిజమే అని కాపుల్లోనే ప్రచారం జరుగుతోంది.  85 ఏళ్ళవయసులో ఉన్న జోగయ్య గోలేమిటంటే కాపు ప్రముఖలంతా కలిసి తనను ఎక్కడ దూరం పెట్టేస్తారేమో అని. జోగయ్య జోక్యాన్ని మిగిలిన వాళ్ళు అంగీకరించటంలేదు. ఎందుకంటే ఈయన మాట్లాడితే పవన్ జిందాబాద్ అంటారు.

మొత్తంమీద అందరికీ అర్ధమవుతున్నదేమంటే అసలు ఏర్పాటవుతుందో లేదో కూడా తెలీని  కాపుల పార్టీ విషయంలో ఆధిపత్యం గొడవలు మొదలైపోయాయని. గంటా ఆధిపత్యాన్ని ఉభయగోదావరి జిల్లాల నేతలు అంగీకరించటంలేదు. గోదావరి జిల్లా నేతల ఆధిపత్యాన్ని కోస్తా జిల్లాల నేతలు ఒప్పుకోవటంలేదు. ఇంకా రాయలసీమ జిల్లాల నేతలెవరు యాక్టవ్ కాలేదు. వీళ్ళు కూడా యాక్టివ్ అయితే గానీ చివరకు ఏమవుతుందో తెలీదు.