కొనేది లే: కేసీఆర్‌కు కేంద్రం షార్ప్ కౌంట‌ర్‌

కేంద్రంపై పోరుకు దిగుతున్నామ‌ని.. ఇది అంతం కాదు.. ఆరంభం మాత్ర‌మేన‌ని. ఇందిరా పార్కు వేదిక‌గా.. నిర్వ‌హించిన నిర‌స‌న‌లో సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌.. వెల్ల‌డించారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఈ యాసంగిలో ధాన్యం కొంట‌రా కొన‌రా? అంటూ.. నిల‌దీశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ పెద్ద‌లు అంద‌రూ పాల్గొన్నారు.

అయితే..కేసీఆర్ ఇలా మైకు క‌ట్టేశారో.. లేదో.. వెంట‌నే కేంద్రం రియాక్ట్ అయిపోయింది. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై వెంట‌నే కౌంట‌ర్ ఇచ్చింది. అది కూడా తెగేసి చెప్పింది. అంతేకాదు..కేసీఆర్‌పై కొన్ని కీల‌క కామెంట్లు కూడా చేసింది.

బాయిల్డ్ రైస్‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకునేది లేద‌ని .. కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఇందిరా పార్కు నుంచి సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌సంగాన్ని నిశితంగా గ‌మ‌నించిన కేంద్రంలోని తెలుగు అధికారులు.. ఆయ‌న ప్ర‌సంగం ముగియ‌గానే మీడియాకు ఒక సందేశం పంపించారు. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌లు.. అత్యంత త‌ప్పుదారి ప‌ట్టించేవేన‌ని.. అవ‌న్నీ కూడా రాజ‌కీయంగానే చూడాలి త‌ప్ప‌.. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల్లో ప‌స‌లేద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ లేవ‌నెత్తిన ప్ర‌తి విష‌యం కూడా .. గ‌డిచిన నాలుగు నెల‌ల కింద‌టే కేంద్రం క్లారిటీ ఇచ్చింద‌ని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ.. కేంద్రానికి స‌మాన‌మేన‌ని.. ఎవ‌రి నుంచి బాయిల్డ్ రైస్‌ను కొనేది లేద‌ని కేంద్ర అధికారులు తెగేసి చెప్పారు.

అంతేకాదు.. కేసీఆర్ చేసే విమ‌ర్శ‌ల‌ను తాము ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. రాజ‌కీయంగా ఆయ‌న చేసే విమ‌ర్శ‌ల‌కు ప్ర‌భుత్వం స‌మాధానం చెప్ప‌బోద‌న్నారు. నాలుగు నెల‌ల కింద‌టే దేశంలో ఉన్న ఆహార ధాన్యాల వివ‌రాల‌ను.. భ‌విష్య‌త్తులో కేంద్రం చేయ‌బోయే విధానాన్ని కూడా రాష్ట్రాల‌కు వివ‌రించిన‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా గోదాములు కిక్కిరిసిపోయి ఉన్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో కొత్తగా ధాన్యం కొనుగోలు చేయ‌డం ద్వారా.. వాటిని నిల్వ చేసుకునే అవ‌కాశం లేద‌ని.. అప్ప‌ట్లోనే రాష్ట్రాల కు చెప్పిన‌ట్టు తెలిపారు. ఏపీ, త‌మిళ‌నాడు, తెలంగాణ ఒడిసా, కేర‌ళ స‌హా అన్ని రాష్ట్రాల‌కూ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశామ‌న్నారు.

అయితే.. వ‌చ్చే యాసంగిలో సాదార‌ణ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామ‌ని.. అయితే. అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి.. స్వ‌ల్ప ప‌రిణామంలోనే ధాన్యం సేక‌రణ ఉంటుంద‌ని.. పేర్కొంది. గ‌త ర‌బీ సీజ‌న్‌లో ఇచ్చిన హామీ మేర‌కు అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని పేర్కొంది. ఇదే విష‌యాన్ని ఇప్ప‌టికే చ‌ర్చించిన‌ట్టు పేర్కొంది. రాష్ట్రాల‌పై వివ‌క్ష చూపించాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వానికి లేద‌న్న అధికారులు.. సీఎం కేసీఆర్‌కు అన్నీ తెలిసే ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

రాజ‌కీయ వివాదాల‌కు కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌త్యాసం ఉంటుంద‌ని తెలిపారు. మొత్తానికి కేసీఆర్‌.. చేసిన వ్యాఖ్య‌ల‌పై కేంద్రం వెంట‌నే రియాక్ట్ కావ‌డం.. కొనేది లేద‌ని.. తెగేసి చెప్ప‌డంతో ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తార‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. చూడాలి మ‌రి ఏం చేస్తారో.