మోడీ ప‌క్కా ప్లాన్‌.. వివాదాస్ప‌ద బిల్లుల‌కు ఆమోద ముద్ర ఖాయం!

సోమవారం నుంచి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశాలు.. ప్ర‌బుత్వానికి ఒక ప‌రీక్ష పెడుతుంటే.. విప‌క్షాల‌కు మ‌రో ప‌రీక్ష పెట్ట‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సమావేశాల నేపథ్యంలో అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. కీలక బిల్లులు ఆమోదించుకోవాలన్న లక్ష్యంతో అధికార పక్షం బరిలోకి దిగుతోంది. చట్టాలకు సంబంధించి భారీ అజెండా రూపొందించుకుంది. 17 కొత్త బిల్లులను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది.

క‌త్తులు నూరుతున్న విప‌క్షాలు

మరోవైపు, ప్రధాన సమస్యలపై సర్కారును ఇరుకున పెట్టాలని విపక్ష పార్టీలు వ్యుహాలు రచించుకుంటున్నాయి. దేశంలో నిత్యా వసర, ఇంధన ధరలు మిన్నంటడంపై విపక్ష సభ్యులు భగ్గుమనే అవకాశం ఉంది. వీటితో పాటు సాగు చట్టాల రద్దు, కరోనా నియంత్రణ, టీకా పంపిణీ, రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం, చైనాతో సరిహద్దు సంక్షోభం, దేశ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. కరోనాను ఎదుర్కోవడం, ధరల పెరుగుదలపై చర్చకు ప్రభుత్వం సమ్మతించే అవకాశం ఉందని తెలుస్తోంది.

బిల్లులు బోలెడు!

వీటిని ప్రస్తావించాలని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడుతున్న వేళ.. ప్రభుత్వం కూడా ఇందుకు సిద్ధమవుతోంది. కొత్తగా 17 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఆర్డినెన్స్ రూపంలో అమలవుతున్న బిల్లులు సైతం పార్లమెంట్ ముందుకు రానున్నాయి. ఇవి కాకుండా లోక్‌సభలో నాలుగు, రాజ్యసభలో మూడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బిల్లు, స్పెషల్‌ డిఫెన్స్‌ సర్వీసెస్ బిల్లు, జాతీయ ఆహార టెక్నాలజీ సంస్థ బిల్లు, దేశ రాజధాని ప్రాంత గాలి నాణ్యత యాజమాన్యంపై ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు, గిరిజన సంస్కరణల బిల్లు, డీఎన్‌ఏ టెక్నాలజీ బిల్లు, ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ బిల్లు, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు, తల్లిదండ్రులు-వృద్ధుల సంక్షేమం బిల్లు, జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతి త‌దిత‌ర బిల్లుల‌ను ఈ ద‌ఫా ప్ర‌వేశ పెట్ట‌నున్నారు.

వివాదాస్ప‌దమే అయినా..

వివాదాస్పద జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ప్రైవేట్ బిల్లులు సైతం పార్లమెంట్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. పలువురు బీజేపీ ఎంపీలు వీటిని సభలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఉభయ సభల సెక్రెటేరియట్లు విడుదల చేసిన సమాచారం ప్రకారం లోక్సభ లో.. ఎంపీ రవికిషన్, రాజ్యసభలో కిరోరి లాల్ మీనా ఈ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. జనాభా నియంత్రణపై మరో రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా సైతం నోటీసు ఇచ్చారు. వీటిపై సభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.