ఆ ఫార్ములా వర్కవుట్ అయితే…కాబోయే సీఎం పవన్?

Pawan Kalyan

రాజకీయాల్లో అనుభవం చాలా ముఖ్యం…ఇదే విషయం చాలా సార్లు నిరూపితమైంది కూడా. ప్రజా జీవితంలో ఎక్కువ కాలం ఉంటే ఎంతోకొంత రాజకీయ అనుభవం వస్తుంది. అయితే, రాజకీయ అనుభవంతోపాటు ప్రజల కష్టాలను అతి దగ్గరగా చూసిన రాజకీయ నాయకులు ప్రజల నాడిపట్టడంలో సక్సెస్ అయ్యారు. పాదయాత్రల ద్వారా ఏపీలోని పల్లె పల్లెకు వెళ్లి ప్రజల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకొని తమ మేనిఫెస్టో ప్రవేశపెట్టిన వారున్నారు.

దివంగత నేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు ఆయన తనయుడు, ఏపీ సీఎం జగన్ వరకు ఇదే ఫార్ములాను నమ్ముకొని సక్సెస్ అయ్యారు. వైఎస్ తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా పాదయాత్ర చేసిన తర్వాతే అధికారం చేపట్టారు. ఇక, తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ కూడా…ఇదే ఫార్ములాతో భవిష్యత్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకుంటున్నారట. 2024 ఎన్నికలకు ముందు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పాదయాత్ర చేపట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో సీఎం సీటుపై గంపెడాశలు పెట్టుకొని భంగపడ్డ పవన్…..రాబోయే ఎన్నికల్లో పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని అనుకుంటున్నారట.

2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి, 2014లో చంద్రబాబు, 2019లో జగన్….వీరంతా పాదయాత్ర చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని పొందారు. దీంతో, ఏపీలో పాదయాత్ర టు ఎన్నికల విజయ యాత్ర…అన్న ఫార్ములా గట్టిగా వర్కవుట్ అవుతుందని పలువురు రాజకీయ నేతలు బలంగా నమ్ముతున్నారు. కళ్ల ఎదురుగా కనబడుతున్న సీఎం కుర్చీ అధిష్టించడానికి…..జనసేనాని పవన్ కు కూడా ఇదే రహదారి అనుకుంటున్నారట. అయితే, ఈ పాదయాత్ర ఐడియా వెనక బీజేపీ పెద్దలున్నారని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే బీజేపీ డైరెక్షన్ లో పవన్ జీవించబోయే యాత్రే..ఈ పాదయాత్ర అంటున్నారు.

వాస్తవానికి 2022 జనవరి నుంచి 2024 జనవరి వరకు పవన్ పాదయాత్ర షెడ్యూల్ చేశారట. పాదయాత్రలో పవన్ పాల్గొనాలంటే 2021 డిసెంబరు నాటికి ఇప్పటికే కమిట్ అయిన సినినామాల షూటింగ్ లు పూర్తి చేసుకోవాలి. అయితే, 2020 కరోనా నామ సంవత్సరంగా మిగిలిపోవడంతో….ఆ షెడ్యూల్ ఒక ఆరు నెలలు ముందుకు జరిగింది. 2022 సమ్మర్ వరకు పవన్ షూటింగులు…వగైరా ఉండవచ్చని టాక్. ఆ తర్వాత పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని 2022 జులై నుంచి పవన్ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాలు…ముఖ్య నియోజకవర్గాలు కవర్ చేసుకొని….పాదయాత్ర పూర్తయ్యే సరికి 2024 ఎన్నికలకు రంగం సిద్ధమవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.

దక్షిణాదిపై పట్టు సాధించేందుకు ఆపసోపాలు పడుతోన్న బీజేపీ….మెల్లగా ఏపీలో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే, ఏపీలో పవన్ ను తెర ముందుకు తెచ్చి…తెర వెనుక చక్రం తిప్పాలని బీజేపీ భావిస్తోందట. ఏపీలో పవన్ అంత ఫేస్ వాల్యూ ఉన్నలీడర్ బీజేపీకి లేరు. పవన్ స్పీచ్…మేనిఫెస్టో…హామీలు…గట్రా వ్యవహారాలన్నీ బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతాయట. బీజేపీ స్క్రిప్ట్… పవన్ యాక్షన్…వెరసి పాదయాత్ర రక్తి కట్టించాలని చూస్తున్నారట. ఇప్పటివరకు ఏపీలో పాదయాత్రసక్సెస్ అయింది. అయితే, పవన్ విషయంలో అది వర్కవుట్ అవుతుందని కచ్చితంగా చెప్పలేం.

వైఎస్, బాబు, జగన్ లు పాదయాత్ర చేస్తున్నప్పటి పరిస్థితులు వేరు. అప్పటి రాజకీయ వాతావరణం వేరు….పాదయాత్ర చేసినవారి బలాబలాలు….పార్టీ కేడర్….ఇలా చాలా ఫ్యాక్టర్స్ పాదయాత్రకు అదనపు బలమయ్యాయి. మాజీ ప్రధాని, దివంగత నేత చంద్రశేఖర్ గతంలో దేశవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర సక్సెస్ కాకపోవడమే ఇందుకు నిదర్శనం. స్వతహాగా పార్టీ బలం లేకపోవడంతో చంద్రశేఖర్ చేసిన పాదయాత్ర ఆయన పార్టీకి కేవలం ఒక్క ఎంపీ సీటు మాత్రమే ఇచ్చింది. ఏపీలో కూడా బీజేపీ, జనసేన లకు సంస్థాగతంగా చెప్పుకోదగ్గ స్థాయిలో కేడర్, బలం లేదు. దీనికితోడు….పవన్ నిలకడ లేనితనం…దుందుడుకు స్వభావం…రాజకీయ అనుభవ రాహిత్యం….వంటివి పాదయాత్రకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా…పాదయాత్ర ఫార్ములా పవన్ కు వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే మరో నాలుగేళ్లు ఆగక తప్పదు.