భ‌ట్టి, పొంగులేటి పంతం.. తెగ‌ని ఖ‌మ్మం పంచాయితీ

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌లో ప్ర‌చారం హోరెత్తుతోంది. అన్ని పార్టీలు గెలుపు కోసం క‌ష్ట‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే బీఆర్ఎస్‌, బీజేపీ 17 లోక్‌స‌భ స్థానాల‌కూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ఎన్నికల ప్ర‌చారంలో సాగుతున్నాయి. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇంకా మూడు స్థానాల‌ను పెండింగ్‌లోనే పెట్టింది. ఖ‌మ్మంతో పాటు క‌రీంన‌గ‌ర్‌, హైద‌రాబాద్‌ల‌కు ఇంకా అభ్య‌ర్థుల‌ను ప్రక‌టించ‌లేదు. ఖ‌మ్మంలో పోటీప‌డేది ఎవ‌రో తేలితే అప్పుడు మిగ‌తా రెండు స్థానాల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముందని తెలిసింది.

కానీ ఖ‌మ్మం లోక్‌స‌భ స్థానంలో పోటీ చేసే అభ్య‌ర్థి విష‌యంలో భ‌ట్టి విక్ర‌మార్క‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలో ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌ని తెలిసింది. తాము సూచించిన వాళ్ల‌కే టికెట్ ఇవ్వాల‌ని చెబుతున్నార‌ని స‌మాచారం. చివ‌ర‌కు పంచాయితీ ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే వ‌ద్ద‌కు చేరింది. ఖ‌మ్మంలో కాంగ్రెస్‌కు మంచి ప‌ట్టుంది. ఉమ్మ‌డి ఖమ్మంలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వాళ్లే. దీంతో ఖ‌మ్మం ఎంపీగా కాంగ్రెస్ అభ్య‌ర్థి గెలిచేందుకు మంచి అవ‌కాశాలున్నాయి.

అందుకే త‌మ‌కు చెందిన వాళ్ల‌ను గెలిపించుకునేందుకు భ‌ట్టి, పొంగులేటి ప‌ట్టుబ‌డుతున్నార‌ని టాక్‌. త‌న స‌తీమ‌ణికి టికెట్ ఇవ్వాల‌ని భ‌ట్టి కోరితే అందుకు పార్టీ అంగీక‌రించ‌లేద‌ని తెలిసింది. దీంతో పొంగులేటి సామాజిక వ‌ర్గానికి చెందిన వాళ్ల‌కు కాకుండా రాయ‌ల నాగేశ్వ‌ర‌రావుకు ఇవ్వాల‌ని భ‌ట్టి సూచించిన‌ట్లు స‌మాచారం. ఇక పార్టీలో చేరేట‌ప్పుడు త‌న‌కు ఇచ్చిన హామీల‌ను అధిష్థానం నెర‌వేర్చుకోవాల‌ని పొంగులేటి కోరుతున్నారు. త‌న సోద‌రుడు ప్ర‌సాదరెడ్డికి టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేసినా ఫ‌లితం ద‌క్క‌లేద‌ని టాక్‌. దీంతో ర‌ఘురామిరెడ్డి పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. పొంగులేటి వియ్యంకుడు ర‌ఘురామిరెడ్డి. మ‌రోవైపు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఏమో త‌న కుమారుడు యుగంధ‌ర్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. కానీ చివ‌ర‌కు పొంగులేటి పంత‌మే నెగ్గేలా క‌నిపిస్తోంది. రఘురామిరెడ్డికే కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.