జ‌గ‌న్‌కు మ‌రో షాక్‌.. నెల్లూరు చేజారిన‌ట్టేనా?

నెల్లూరుపై ప‌ట్టు  నిల‌బెట్టుకునేందుకు వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా లాభం లేకుండా పోతోంది. 2014 ఎన్నిక‌ల్లో నెల్లూరులో 10కి 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌కులే గెలిచారు. కానీ ఈ సారి ప‌రిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. అందుకే క‌నీసం 5 సీట్లు గెలిచినా చాల‌నే ప‌రిస్థితికి జ‌గ‌న్ వ‌చ్చార‌నే టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పుడు అవి కూడా రావ‌డం గ‌గ‌మ‌నే చెప్పాలి. వైసీపీపై వ్య‌తిరేక‌త‌, కూట‌మి బ‌లం జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టే అవ‌కాశం ఉంది. ఇక నెల్లూరులో ప‌ట్టు కోసం కిందామీద ప‌డుతున్న జ‌గ‌న్‌కు తాజాగా మ‌రో షాక్ త‌గిలింది.

నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరికి చెందిన వైసీపీ కీల‌క నేత మెట్టుకూరు చిరంజీవి రెడ్డి తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వినీ వ‌దులుకున్నారు. ఆయ‌న టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. గ‌త ఎన్నిక‌ల్లో ఉద‌య‌గిరి నుంచి పోటీ చేయాల‌ని చిరంజీవి రెడ్డి అనుకున్నారు. కానీ మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి జ‌గ‌న్ టికెట్ కేటాయించారు.  ఇక నిరుడు మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డ్డార‌ని వైసీపీ పార్టీ చంద్ర‌శేఖ‌ర్‌ను స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో చంద్రశేఖ‌ర్ రెడ్డి టీడీపీలో చేరారు.

గ‌త ఎన్నిక‌ల్లో సీటు రాక‌పోవ‌డంతో అసంతృప్తితో ఉన్న చిరంజీవిని పోలీస్ హౌసింగ్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వితో జ‌గ‌న్ బుజ్జ‌గించారు. ఈ సారి ఎన్నిక‌ల్లోనూ పోటీకి చిరంజీవి సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది. ఉద‌య‌గిరి టికెట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ను చిరంజీవి అడిగినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని స‌మాచారం.  ఈ సారి మేక‌పాటి రాజ‌గోపాల్ రెడ్డిని జ‌గ‌న్ నిలబెట్టారు. దీంతో కొద్దిరోజులుగా అస‌హ‌నంతో ఉన్న చిరంజీవి ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్‌కు గుడ్‌బై చెప్పారు. టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ ప‌రిణామంతో నెల్లూరు జిల్లాలో వైసీపీకి మ‌రింత డ్యామేజీ జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.