సైనాపై సిద్దార్థ్ షాకింగ్ ట్వీట్.. తీవ్ర వివాదం

త‌ర‌చుగా.. త‌న వ్యాఖ్య‌ల‌తో మీడియాలో ఉండే.. బొమ్మ‌రిల్లు ఫేమ్ హీరో.. సిద్ధార్థ‌.. తాజాగా షట్లర్ సైనాపై అసభ్యకర రీతిలో సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఇది తీవ్ర వివాదంగా మారింది. ఈ విషయమై జాతీయ మహిళా కమిషన్ ఫుల్ సీరియస్గా ఉంది. అతడి ఖాతాను వెంటనే డిలీట్ చేయాలని ట్విట్టర్ ఇండియాకు లేఖ రాసింది.  హీరో సిద్ధార్థ్ వ్యవహార శైలిపై జాతీయ మహిళ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్పై అతడు అభ్యంతర కామెంట్స్ చేశాడని, ఈ కేసులో మహారాష్ట్ర డీజీపీ విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు.

ఏం జ‌రిగిందంటే
గత వారంలో ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్‌లో  ఒక సభలో పాల్గొనాల్సి ఉంది. నిరసనకారులు మోడీ కాన్వాయ్‌ను ప్లైఓవర్‌పై దాదాపుగా 20నిమిషాలు అడ్డగించారు. దీంతో సభ రద్దయిపోయింది. సభలో పాల్గొనకుండానే ఆయన వెనుదిరిగాల్సి వచ్చింది. ఆ ఘటనను ఉద్దేశిస్తూ సైనా నెహ్వాల్ ఒక ట్వీట్ చేసింది. ‘‘  ప్రధాని మోదీకే  భద్రత లభించనప్పుడు మన దేశం సురక్షితమైనదని చెప్పలేం. ప్రధానిపై అరాచకవాదుల  పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను ’’ అని సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది.  సైనా చేసిన ట్వీట్ ను సిద్దార్థ్ రీ ట్వీట్ చేశాడు. ‘‘కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్. థాంక్ గాడ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా..షేమ్ యూ రిహన్నా ’’ అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. సైనాను ‘‘కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ ’’ అనడంతో ఆ ట్వీట్‌పై దుమారం రేగింది.

షాకింగ్ రెస్పాన్స్‌
సిద్దార్థ్ చేసిన ట్వీట్‌ను పలువురు ప్రముఖులు ఖండించారు. శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది హీరో వ్యాఖ్యలను ఖండించారు. సింగర్ చిన్మయి శ్రీపాద కూడా సిద్దార్థ్‌కు వ్యతిరేకంగా గళమెత్తింది. ‘‘ సిద్దార్థ్ ఇది చాలా దారుణం. మీటూ ఉద్యమంలో అనేక మంది మహిళలకు మద్దతుగా మీరు మాట్లాడారు. కాక్ చాంఫియన్ ఆఫ్ ది వరల్డ్ అనే పదానికి మరో అర్థం ఉంది. సైనాను ఆ పదంతో సంబోధించడం అవమాన‌కరం ’’ అని చిన్మయి శ్రీపాద ట్వీట్ చేసింది. సైనాకు మద్దతుగా పారపల్లి కశ్యప్ కూడా ట్వీట్ చేశాడు. ‘‘ అభిప్రాయం చెప్పడం తప్పు కాదు. కానీ, చెప్పేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలి ’’ అని కశ్యప్ ట్వీట్ చేశాడు.

మాట మార్చిన సిద్ధార్థ‌
తన ట్వీట్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిద్ధార్థ్ మాట మారుస్తూ మరో ట్వీట్ చేశాడు. తను ఎలాంటి దురుద్దేశంతో కామెంట్ చేయాలేదని అన్నాడు. అయితే సిద్ధార్థ్ ట్విట్టర్ ఖాతాను తక్షణమే బ్లాక్ చేయాలని మహిళా కమిషన్ ఛైర్మన్.. ట్విట్టర్ ఇండియా రెసిడెంట్ గ్రీవెన్స్కు లేఖ రాశారు.