ప్రభాస్ సరసన కియారా అద్వానీ ?

గత ఏడాది డిసెంబర్ లో విడుదలై భారీ వసూళ్లు సాధించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కి కొనసాగింపు శౌర్యంగపర్వం ఎప్పుడు వస్తుందాని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇంకా షూటింగ్ మొదలుకానప్పటికీ కల్కి 2898 ఏడి రిలీజ్ కాగానే సెట్స్ పైకి వెళ్లొచ్చని బెంగళూరు టాక్. దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఇది పూర్తి చేస్తే ఆపై జూనియర్ ఎన్టీఆర్ – మైత్రి మూవీ మేకర్స్ పనులకు వెళ్లిపోవచ్చనే దిశగా పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు తెలిసింది. ఇది పక్కనపెడితే సలార్ 2కి సంబంధించిన ఒక హాట్ అప్డేట్ క్రేజీగా ఉంది.

మొదటి భాగంలో శృతి హాసన్ ఒక్కర్తే హీరోయిన్ గా నటించింది. ఇప్పుడీ సీక్వెల్ లో కియారా అద్వానీని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. అలా అని శృతి స్థానాన్ని తనేమి భర్తీచేయడం లేదు. కథ ప్రకారం ఇంకో అమ్మాయి అవసరం పడటం, అందులోనూ ప్రాధాన్యత ఉన్నది కావడంతో ప్రశాంత్ నీల్ ఏకంగా బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో బిజీగా ఉన్న కియారా జూనియర్ ఎన్టీఆర్ వార్ 2లోనూ నటిస్తోంది. ఇప్పుడు సలార్ 2 అంటే ప్రభాస్ జోడి అంటే నో అనే ఛాన్స్ ఉండదు.

ఇది నిర్ధారణగా తెలియడానికి ఇంకొంచెం టైం అయితే పడుతుంది. సలార్ 1లో మిగిలిపోయిన బోలెడు ప్రశ్నలు, ప్రేక్షకుల్లో కలిగిన కొంత అసంతృప్తి వీటన్నింటికి సమాధానం ప్రశాంత్ నీల్ ఈ పార్ట్ 2లో చెప్పాలి. ఒకరిద్దరు మినహాయించి మొత్తం క్యాస్టింగ్ రిపీట్ కానుంది. 2025లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు కానీ వీలైనంత త్వరగా స్టార్ట్ చేస్తే తప్ప అది సాధ్యం కాదు. ప్రభాస్ మాత్రం ది రాజా సాబ్ చివరి దశకు రాగానే సలార్ 2కి ఎక్కువ డేట్లు ఇస్తానని చెప్పాడట. స్పిరిట్. హను రాఘవపూడి ప్రాజెక్టులు ఇంకొంచెం టైం పట్టేలా ఉన్నాయి కాబట్టి ఈ ప్రణాళికే బెటర్.