ఈ క్రికెట‌ర్ ప్ర‌శ్న‌కు జ‌వాబుందా?

‘‘కరోనా విలయతాండవం చేస్తూ ఆసుపత్రుల్లో పడకలు దొరకక రోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఫ్రాంచైజీలు, కంపెనీలు, ప్రభుత్వం ఐపీఎల్‌పై ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఆశ్చర్యం కలిగిస్తోంది’’.. ఇదీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై చేసిన వ్యాఖ్య. అతను ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాడు. ఐతే మన దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతుండటం.. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రయాణికుల విషయంలో తమ దేశం ఆంక్షలు పెడుతుండటంతో మున్ముందు ఇబ్బందులు తప్పవేమో, ఇండియాలోనే కొన్ని నెలల పాటు ఉండిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో టై ఐపీఎల్ నుంచి మధ్యలో తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశానికి ప్రయాణం అవుతున్నాడు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్య చేశాడు. టై లేవనెత్తిన ప్రశ్నకు మనం ఎవ్వరం సమాధానం చెప్పలేని పరిస్థితి.

అప్పుడప్పుడూ టైమ్స్ లాంటి సంస్థలు ప్రకటించే ప్రపంచ కుబేరుల జాబితా చూస్తే మన వాళ్ల పేర్లు మెరిసిపోతుంటాయి. అదే సమయంలో దేశంలో పేదరికం శాతం ఎప్పటికీ తగ్గదు. ఓ పక్క రోజూ తిండికి లేక అల్లాడే వాళ్లు కోట్లల్లో ఉంటారు. అదే సమయంలో రోజూ వేల టన్నుల్లో ఆహారం వృథా అవుతుంటుంది. ఈ వైరుధ్యం మన ఇండియా ప్రత్యేకత. మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి, బయట అడుగు పెట్టకండి అంటూ టీవీలో ఉపదేశం చేసే ప్రభుత్వ అధినేతలు ఎన్నికల కోసం తపన పడిపోతారు. వేల మందిని పోగేసి సభలు పెడతారు. విజయవంతంగా కరోనాను విస్తరింపజేస్తారు. కరోనా తీవ్రత పెరుగుతోందని తెలిసి కూడా ఎన్నికల కోసమని దేశంలో ఎక్కడా ఏ షరతులూ లేకుండా వదిలేయడంతో వైరస్ తీవ్ర రూపం దాల్చిందని తెలుసు. కానీ ఏ దశలోనూ ఎన్నికలకు బ్రేక్ పడలేదు.

గత ఏడాది కరోనా వైరస్ కొత్త కాబట్టి అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నిరోధక చర్యలు చేపట్టలేకపోయామని ప్రభుత్వాలు సమర్థించుకున్నాయి. కానీ సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా దేశంలో వైద్య సదుపాయాలు అభివృద్ధి చేయడం, కొత్తగా ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించడం లాంటి చర్యలు పెద్దగా చేపట్టింది లేదు. వైరస్‌న జయించేశామని గొప్పలు చెప్పుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు సామాన్యులు వైద్యం అందక, ఆక్సిజన్ అందుబాటులో లేక పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆండ్రూ టై మన దేశం, వ్యవస్థలో డొల్లతనాన్ని బయటపెట్టేలా వ్యాఖ్య చేశాడు. కానీ దీన్ని పట్టించుకునేదెవరు?