బీజేపీపై మండిపోతున్న నెటిజన్లు

‘ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వం’.. ఇది తాజాగా కేంద్ర హోంమంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటులో చేసిన ప్రకటన. దీనికి బదులుగా నెటిజన్లు ‘బీజేపీకి ఓట్లు వేయం’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రివర్సు పోస్టులు పెడుతున్నారు. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వం-బీజేపీకి ఓట్లు వేయం అని పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడుపుతున్నారు నెటిజన్లు. పనిలో పనిగా నరేంద్రమోడి పైన కూడా నెటిజన్లు విపరీతంగా మండిపోతున్నారు.

మోడి సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏపి ప్రయోజనాలను ఓ పద్దతి ప్రకారం దెబ్బ కొడుతున్న విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. విభజన చట్టాన్ని అప్పటి పార్లమెంటు సమావేశాలు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టంలో ఏపికి ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్ ఉన్న విషయాన్ని మేధావులు, సామాజిక ఉద్యమకారులు పదే పదే ప్రస్తావిస్తున్నారు.

ప్రత్యేకహోదాను 14వ ఆర్ధికసంఘం రద్దు చేసిందన్న కేంద్రమంత్రి ప్రకటన కూడా పూర్తిగా తప్పే అంటున్నారు మేధావులు. ఎందుకంటే ప్రత్యేకహోదాను డిసైడ్ చేసేది జాతీయ అభివృద్ధి మండలే కానీ ఆర్ధికసంఘం కాదని గుర్తుచేస్తున్నారు. నీతి అయోగ్ అయినా, ఆర్ధికసంఘం అయినా జాతీయ అభివృద్ధి మండలి అయినా ప్రధానమంత్రి అధికారాలకు లోబడి పనిచేసేవే అన్న విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.

ఏ విషయమైనా ప్రధానికి నచ్చకపోతే ఏదో సాకుతో దాన్ని అమలు చేయకుండా తప్పించుకుంటారు. అదే ప్రధాని గనుక అమలు చేయాలని అనుకుంటే అదే విషయాన్ని ఏదోసంఘం పేరుతో సిఫారసులు తెప్పించుకుంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రధాని నిర్ణయమే అంతిమం అని అందరికీ అర్ధమైపోయింది. ఏపికి ప్రత్యేకహోదా, రైల్వేజోన్ ఇవ్వటం మోడికి ఇష్టం లేదు కాబట్టి 14వ ఆర్ధికసంఘమని, నీతిఅయోగ్ సిఫారసులని సాకులు చెబుతున్నారు.

మొత్తానికి మోడి వ్యవహార శైలిపై మండిపోతున్న జనాలు బీజేపీకి ఎందుకు ఓట్లేయాలని నిలదీస్తున్నారు. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వం అని కేంద్రం ప్రకటించగానే బీజేపీకి ఓట్లేయమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం పెరిగిపోతోంది. అసలే బీజేపీ పరిస్దితి అంతంతమాత్రం. దానికితోడు సరిగ్గా ఎన్నికలకు ముందు హోదాపై తాజాగా కేంద్రం చేసిన ప్రకటన అభ్యర్ధి విజయంపై పెద్ద బండిపడినట్లుగానే ఉంది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.