జగన్ చేతిలో ఉన్న చిల్లరెంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా ? మొత్తం రూ.529.87 కోట్లు. కానీ ఆయన చేతిలో ఉన్న నగదు ఎంతో తెలుసా ? కేవలం రూ.7 వేలు మాత్రమే. జగన్ సతీమణి భారతి పేరిట ఉన్న ఆస్తులు రూ.176.63 కోట్లు. కానీ ఆమె చేతిలో ఉన్న నగదు రూ.10,022 మాత్రమే. ఇద్దరు కుమార్తెలు హర్షిణి రెడ్డి, వర్షారెడ్డిల పేర ఉన్న ఆస్తులు రూ.51.50 కోట్లు. కానీ పెద్ద కూతురు వద్ద రూ.3 వేల నగదు, చిన్న కూతురు వద్ద రూ.6980 నగదు మాత్రమే ఉన్నాయి.

పులివెందుల శాసనసభ స్థానానికి దాఖలు చేసిన నామినేషన్ సంధర్భంగా వెల్లడించిన అఫిడవిట్ పొందు పరిచిన వివరాలు ఇవి. 2019లో జగన్‌ ఒక్కరి ఆస్తుల విలువ రూ.375 కోట్ల 20 లక్షలు కాగా గత అయిదేళ్లలో ఆయన ఆస్తుల విలువ రూ.154 కోట్ల 67 లక్షల మేర అంటే 41.22 శాతం పెరిగింది. 2019లో జగన్‌ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.510 కోట్లు 38 లక్షలు కాగా అయిదేళ్లలో రూ.247 కోట్ల 27 లక్షలు అంటే 48.45 శాతం పెరిగింది.

ఇక జగన్‌ ఓ సంస్థకు రూ.43 కోట్ల 10 లక్షలు అప్పు ఇవ్వగా, మరికొందరికి రూ.136 కోట్ల 15 లక్షలు అప్పుగా ఇచ్చారు. భారతిరెడ్డికి రుణగ్రహీతల నుంచి రూ.4 కోట్ల 37 లక్షలు రావాలి. ఇవి కాకుండా 26లక్షల 54 వేల మేర రుణాలిచ్చారు. జగన్ కుమార్తెలు హర్షిణిరెడ్డి రూ.2 కోట్ల 43 లక్షలు, వర్షారెడ్డి రూ.2 కోట్ల 68 లక్షలు అడ్వాన్సులుగా ఇచ్చారు.

జగన్‌కు రూ.కోటి 10లక్షల 78వేల 350 రూపాయలు, భారతికి రూ.7 కోట్ల 41లక్షల 79వేల 353, హర్షిణిరెడ్డికి  రూ.9 కోట్ల 2లక్షలు,  వర్షారెడ్డికి అంతే మేర అప్పులున్నట్లు అఫిడవిట్ లో పేర్కొనడం గమనార్హం. ఇన్ని కోట్ల ఆస్తులున్నా మరి చేతిలో చిల్లి గవ్వ ఎందుకు లేదన్నది ప్రశ్నార్ధకం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో  ఆడవాళ్ల వయసు, రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలు అడక్కూడదు, ఆరా తీయకూడదు అన్న సెటైర్లు మీడియా వర్గాలలో వినిపిస్తున్నాయి.