గంట వ్యవధిలో మూడు రిలీజ్ డేట్లు

కరోనా విరామం కారణంగా విడుదల కోసం ఎదురు చూస్తున్న జాబితాలో చాలా పెద్దగానే తయారైంది టాలీవుడ్లో. వీటికి తోడు కొత్తగా షూటింగ్ పూర్తి చేసుకున్న, చేసుకుంటున్న చిత్రాల సంఖ్య కూడా పెద్దగానే ఉంది. ఎప్పుడైతే థియేటర్లు పున:ప్రారంభమై, జనాలు మళ్లీ పెద్ద తెర వైపు కదిలారో అప్పుడు సినీ జనాలకు ఉత్సాహం వచ్చింది. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వరుస బెట్టి సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు. రాబోయే రోజులకు సినిమాలను చకచకా షెడ్యూల్ చేసేస్తున్నారు.

ఈ నెల రోజుల్లో పదుల సంఖ్యలో కొత్త సినిమాలకు బెర్తులు ఖరారయ్యాయి. అన్ సీజన్ అనదగ్గ ఫిబ్రవరి, మార్చి నెలలకు కూడా విపరీతమైన పోటీ నెలకొంది. ఇక మంచి డిమాండ్ ఉన్న వేసవి గురించి చెప్పాల్సిన పని లేదు. రెండంకెల సంఖ్యలో చిత్రాలు వేసవి సీజన్ మీద కర్చీఫ్ వేసేశాయి. ఆ తర్వాత సీజన్లలో కూడా మంచి మంచి డేట్లు చూసి విడుదల ఖరారు చేస్తున్నారు.

గురువారం ఓ గంట వ్యవధిలో మూడు పేరున్న సినిమాల విడుదల తేదీలు ప్రకటించారు. ముందుగా మెగా కుర్రాడు వరుణ్ తేజ్ లైన్లోకి వచ్చాడు. తన కొత్త చిత్రం ‘గని’ రిలీజ్ డేట్ ప్రకటించాడు. ఈ చిత్రం ‘మెగా’ సెంటిమెంటును కొనసాగిస్తూ జులై 30న విడుదల కాబోతోంది. ఈ నెల చివరి వారంలో తొలి ప్రేమ, ఇంద్ర, మగధీర లాంటి మెగా హిట్లు వచ్చాయి కొణిదెల కుటుంబం నుంచి. మరోవైపు ‘పుష్ప’ టీం సైతం కాసేపటికే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఊహించని విధంగా ఆగస్టు 13నే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో మెగా అభిమానుల ఆనందం రెట్టింపైంది.

మరోవైపు యాక్షన్ హీరో గోపీచంద్ ఏమో వేసవి రేసులోకి వచ్చాడు. ఇంతకుముందు తనతో ‘గౌతమ్ నంద’ తీసిన సంపత్ నంది దర్శకత్వంలో గోపీ చేస్తున్న ‘సీటీ మార్’ను ఏప్రిల్ 2కు ఫిక్స్ చేశారు. మాస్‌ను ఆకట్టుకునే ఓ పోస్టర్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మార్చి చివరి వారంలో రంగ్‌దె, అరణ్య రాబోతుండగా.. ఏప్రిల్ రెండో వారానికి ‘వకీల్ సాబ్’ రావొచ్చని అంటున్నారు. ఆ నెల 16కు లవ్ స్టోరి, టక్ జగదీష్ ఖరారయ్యాయి. మధ్యలో మిగిలిన వారాన్ని గోపీ తీసేసుకున్నాడు.