గాంజా పక్కకు కొత్త దర్శకుడు ముందుకు

విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ విపరీతంగా నెమ్మదించేశాడు. దాని మొదటి యానివర్సరీ జరిగిపోయినా సరే తేజ్ మాత్రం ఖాళీగానే ఉన్నాడు. బ్రో ఆనందం పరిమితంగానే మిగిలింది. కలర్స్ స్వాతితో చేసిన అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిం సత్య ప్రమోషన్లలో తప్ప బయట కనిపించడం లేదు. సితార బ్యానర్ లో నెలల క్రితం ప్రకటించిన గాంజా శంకర్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో అధికారికంగా అనౌన్స్ చేశాక ఆగిపోవడం వెనుక బడ్జెట్ కారణాలని వినిపిస్తోంది కానీ నిజానిజాలు మాట్లాడేందుకు టీమ్ లో ఎవరూ సిద్ధంగా లేరు.

ఇప్పుడు దీని స్థానంలో సాయి దుర్గ తేజ్ రోహిత్ అనే కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హనుమాన్ లాంటి అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో సంస్థలో దీన్ని నిర్మించబోతున్నారు. ఇటీవలే ప్రియదర్శి నభ నటేష్ కాంబోలో డార్లింగ్ ప్రకటించిన కొద్దిరోజులకే ఇప్పుడు తేజు ప్రాజెక్టుకి రంగం సిద్ధం చేశారట. వచ్చే నెల లేదా జూన్ లో షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, జానర్ బయటికి చెప్పకపోయినా యాక్షన్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో సాగుతుందని టాక్.

క్రమంగా సాయి దుర్గ తేజ్ స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చింది. పోటీ పెరిగిపోయి మెగా హీరోలు వెనుకబడుతున్నారు. తమ్ముడు వైష్ణవ్ తేజ్ వరసగా మూడు డిజాస్టర్లు మూటగట్టుకుని మార్కెట్ ని రిస్క్ లో పడేశాడు. వరుణ్ తేజ్ నేనేం తక్కువాని హ్యాట్రిక్ సూపర్ ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. చేతిలో హిట్ ఉన్న సాయి తేజ్ మాత్రం నెలల తరబడి సమయాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాడు. మావయ్య పవన్ కళ్యాణ్ తో నటించిన బ్రో గొప్ప క్లాసిక్ గా నిలిచిపోతుందనుకుంటే ఆ ఆశ నెరవేరలేదు. ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ మీద ఇంత నమ్మకం పెట్టాడంటే కంటెంట్ ఏదో బలంగానే ఉందనుకోవాలి.