పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించిన అమిత్‌షా..

Amit Shah Corona

‘సర్జికల్ స్ట్రైక్’ఈ మాట బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పాగా వేసినప్పటికీ నుంచి తరచూ వినిపిస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వరకు అందరూ ప్రతి సందర్భంలోనూ ఇదే మాటను వల్లెవేస్తుంటారు. అసలు సర్జికల్ స్ట్రైక్ అంటే ఏమిటి? ఎందుకు చేయాల్సి వస్తోంది? ఎలాంటి సందర్భాల ఆపరేషన్ చేస్తారు? ఇలా అనేక ప్రశ్నలు సాధారణంగా మన మెదళ్లను తొలిచివేస్తుంటాయి.

సర్జికల్ స్ట్రైక్ అనేది ఒక రకమైన మిలిటరీ దాడి. చుట్టుపక్కల పరిసరాలు, వాహనాలు, భవనాలు, నివాస సముదాయాలు, మౌలిక సదుపాయాలు, ఇలా సాధ్యమైనంత వరకు నష్టం జరగకుండా నైపుణ్యంలో చేసే పక్రియనే సర్జికల్ స్ట్రైక్ అంటారు. సైన్యం నిర్దేశిత లక్ష్యాలను మాత్రమే గురి తప్పకుండా ధ్వంసం చేస్తుంది. ఈ తరహా దాడులను నిర్వహించడం కష్టంతో కూడుకున్నపని అని మిలిటరీ నిపుణులు చెబుతుంటారు. దీనికి పక్కా వ్యూహంతో పాటు సమన్వయంతో సర్జికల్ స్ట్రైక్ చేస్తారు.

గోవాలోని ధర్బండోరాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడి చేసిన వారితో కూర్చుని చర్చించే రోజులు ఒకప్పుడు ఉండేవని, ఇవి ఉగ్రవాద దాడులకు దీటైన జవాబు చెప్పే రోజులని ఘాటుగా హెచ్చరించారు. 2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తు చేస్తూ, పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం చాలా ముఖ్యమైన విషయమని అమిత్ షా గుర్తుచేశారు. మీరు ఇలాగే అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స్ట్రైక్స్ త‌ప్ప‌వు అని అమిత్ షా హెచ్చ‌రించారు.

దాడుల‌ను ఏమాత్రం స‌హించ‌బోమ‌ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్… ఇప్పటికే ఓసారి నిరూపించాయని గుర్తుచేశారు. పూంచ్‌లో భారత ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసిన పాక్‌ ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామని అమిత్ షా తెలిపారు. అమిత్‌షా , ఉగ్రదాడులను అరికట్టడానికి మళ్లీ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేయడానికి భారత బలగాలు సిద్దంగా ఉన్నాయని హెచ్చరించారు. కొద్ది రోజులుగా జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయి. హిందువులు, సిక్కులను గుర్తించి ఉగ్రవాదులు చంపుతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో సమాధానం చెబుతామని పాకిస్థాన్‌ను హెచ్చరించారు.