వేణు స్వామి… ఇంత నీచమా?

అత్యంత వివాదాస్పద జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వివిధ సందర్భాల్లో ఎంత అతి చేశాడో చూస్తూనే వచ్చాం. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళ శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే.. కొన్నేళ్లలోనే వీళ్లు విడాకులు తీసుకుంటారని వ్యాఖ్యానించిన ఘనత ఆయనకే సొంతం. ప్రభాస్ ఆరోగ్యం, తన కెరీర్ గురించి కూడా గతంలో వేణు స్వామి చెప్పిన జోస్యాలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై స్వయంగా ప్రభాస్ పెద్దమ్మ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా వేణు స్వామి చుట్టూ చాలా వివాదాలే ఉన్నాయి. చైతూ-శోభితల గురించి వేణు స్వామి మాట్లాడినపుడు తెలుగు సినీ పరిశ్రమ తరఫున కొందరు వెళ్లి మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయడం.. దీని మీద మీడియాలో కూడా రాద్దాంతం జరగడంతో వేణు స్వామి కొంచెం వెనక్కి తగ్గినట్లు కనిపించారు.

ఐతే కుక్క తోక వంకర అనే సామెతను గుర్తు చేస్తూ ఆయన తాజాగా ఒక జర్నలిస్టుతో మాట్లాడుతూ కొందరు సినీ తారల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వేణు స్వామి మీద ఇంతకుముందే టీవీ5లో చర్చ పెట్టి ఆయనకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసిన సీనియర్ జర్నలిస్ట్ మూర్తి.. తాజాగా మరోసారి వేణు స్వామి బాగోతాన్ని బయటపెట్టారు. ఒక జర్నలిస్టుతో మాట్లాడుతూ.. ముగ్గురు సినీ ప్రముఖులు రాబోయే రోజుల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోతారని వేణు స్వామి జోస్యం చెప్పారు. ఆ ముగ్గురూ.. ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత కావడం గమనార్హం.

ప్రభాస్‌కు టాప్‌ టు బాటమ్ ఒళ్లంతా గాయాలే అంటూ.. ఆ బాధ తట్టుకోలేక సుసైడ్ చేసుకోవచ్చని వేణు స్వామి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పినవి గతంలో చాలా జరిగాయని.. ఇప్పుడు ఇవి కూడా జరిగి తీరుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి ఇలా మాట్లాడి, వారితో పరిహార పూజలు చేయించి భారీగా డబ్బులు తీసుకోవడం వేణు స్వామికి అలవాటని.. వేణు స్వామి బాధితులు చాలా మంది గురించి తనకు తెలుసని.. ఇండస్ట్రీ ఐకమత్యంగా ఉండి ఇలాంటి వారి పని పట్టాలని మూర్తి ఈ చర్చా కార్యక్రమంలో పిలుపునిచ్చారు.