వైసీపీకి సెగ‌: కార్యాల‌యాలు క‌నిపించ‌డం లేదు

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి మ‌రో స‌మ‌స్య ఎదుర‌వుతోంది. ఒక‌వైపు పార్టీ నుంచి నాయ‌కులు ర‌న్ రాజా ర‌న్ అన్న‌ట్టుగా పొరుగు పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. మ‌రికొంద‌రు మౌనంగా ఉన్నారు. ఇంకొంద‌రు అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే.. పార్టీ అధినేత జ‌గ‌న్ మాత్రం ఇవ‌న్నీ తెలిసి కూడా చాలా నింపాదిగా ఉంటున్నారు. అస‌లు ఏమీ జ‌ర‌గ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. ఫీల్ గుడ్ థియ‌రీ నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రాలేదు.

ఇక, ఇప్పుడు మ‌రో కీల‌క‌మైన వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. పార్టీ ఓట‌మి పాలైన నాలుగు మాసాల్లోనే కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కార్యాల‌యాల‌ను ఎత్తేస్తున్నారు. ఇలా ఎత్తేస్తున్న వారిలో మెజారిటీ నాయ‌కు లు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారే ఉండ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యంగా ఉంది. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ప‌రిధిలో.. వైసీపీ నాయ‌కుడు పూనూరు గౌతం రెడ్డి.. త‌న సొంత ఇంటినే పార్టీ కార్యాల‌యంగా మార్చుకు న్నారు. 2014 నుంచి ఆయ‌న ఇక్క‌డే పార్టీ ఆఫీస్ నిర్వ‌హిస్తున్నారు.

కానీ, పార్టీ ఓట‌మి త‌ర్వాత‌.. త‌న ఇంటి నుంచి కార్యాల‌యాన్ని తీసేసి.. ఇంటిని అద్దెకు ఇచ్చేసుకున్నారు. దీంతో పార్టీ కార్యాల‌యం ద‌గ్గ‌ర ఉండాల్సిన పెద్ద ఎత్తున బోర్డులు, జ‌గ‌న్ బొమ్మ‌లు అన్నీ మాయ‌మై పోయాయి. ఇక, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు కార్యాల‌యాలు ఉంటే.. దీనిని ఒక కార్యాల‌యానికి కుదించారు. మిగిలిన మూడు చోట్ల రెంటు క‌ట్టాల్సి ఉంటుంద‌న్న కార‌ణంగా ఎత్తేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, కీల‌క‌మైన చిత్తూరుజిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న పార్టీ కార్యాల‌యం ఎప్పుడో ఎత్తేశారు.

అక్క‌డ ఇప్పుడు రోజువారి హోట‌ల్ నిర్వ‌హిస్తున్నారు. గుంటూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న నాలుగు పార్టీ కార్యాల‌యాల‌ను గ‌త వారం తీసేశారు. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన రోశ‌య్య‌.. ఇటీవ‌ల జ‌న‌సేన‌లో చేరిపోవ‌డంతో పార్టీ కార్యాల‌యాల‌ను తీసేశారు. ఇక‌, తాజాగా మురుగుడు లావ‌ణ్య‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో మంగ‌ళ‌గిరి మెయిన్ రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాల‌యానికి తాళాలు వేశారు. అనంతపురంలోనూ ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.