కేటీఆర్ గో బ్యాక్‌- మిన్నంటిన నినాదాలు

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు భారీ సెగ త‌గిలింది. కేటీఆర్ గో బ్యాక్ నినాదాలతో ఆయ‌న ఉలిక్కి ప‌డ్డారు. శ‌నివారం రాత్రి మృతి చెందిన ఢిల్లీ విశ్వ విద్యాల‌యం మాజీ ప్రొఫెస‌ర్ జీ. ఎన్‌. సాయిబాబా భౌతిక దేహాన్ని హైద‌రాబాద్‌లోని మౌలాలీలో ఉన్న ఆయ‌న నివాసంలో ఉంచారు. అభిమానులు, ఆయ‌న పూర్వ విద్యార్థుల సంద‌ర్శ‌న కోసం ఏర్పాట్లు చేశారు.

ఈ స‌మ‌యంలో ప్రొఫెస‌ర్ సాయిబాబా పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు కేటీఆర్ ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. ఆయ‌న వెంట ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే… అప్ప‌టికే భారీ సంఖ్య‌లో ఉన్న ఉస్మానియా యూనివ‌ర్సిటీకి చెందిన పూర్వ‌విద్యార్థులు కేటీఆర్‌ను చూసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. వెంట‌నే వెన‌క్కి వెళ్లిపోవాల‌ని సూచించారు.

ఈ సంద‌ర్బంగా ప‌లువురు విద్యార్థులు `కేటీఆర్ గో బ్యాక్` అంటూ.. నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో బీఆర్ఎస్ నాయ‌కులు, శ్రేణులు కూడా బ‌త్త‌ర‌పోయారు. వారు తేరుకునేలోగానే విద్యార్థుల సంఖ్య‌, నినాదాల మోత మ‌రింత పెరిగిపోయింది. దీంతో తెచ్చిన పూల దండ‌ల‌ను సాయిబాబా పార్థివ దేహంపై ఉంచి.. నివాళుల‌ర్పించిన కేటీఆర్ ఆ వెంట‌నే అక్క‌డ నుంచి వెనుదిరిగారు. వాస్త‌వానికి ఆయ‌న సాయిబాబా కుటుంబాన్ని ప‌రామ‌ర్శించాల‌ని భావించారు. కానీ, విద్యార్థుల ఆందోళ‌న‌తో అసంపూర్తిగానే కేటీఆర్ కార్య‌క్ర‌మాన్ని ముగించారు.