మోడీని దేశం భుజాల‌కెత్తుకుంది..

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని దేశ ప్ర‌జ‌లు భుజాల‌కు ఎత్తుకున్నార‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంసించారు. హ‌రియాణాలో వ‌రుస‌గా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావ‌డం దీనికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. సుప‌రిపాల‌న‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని తెలిపారు. 90 స్థానా లున్న హ‌రియాణాలో 48 స్థానాలు ద‌క్కించుకోవ‌డం, వ‌రుస‌గా మూడో సారి అధికారంలోకి రావ‌డం వంటివి మోడీ పాల‌న కే సాధ్య‌మైంద‌ని కొనియాడారు. ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం మోడీవైపే చూస్తోంద‌ని చెప్పారు. హ‌రియాణాలో బీజేపీకి 40 శాతం ఓట్లు వ‌చ్చాయ‌ని, ఇది గ‌త ఎన్నిక‌ల కంటే ఎక్కువ‌గా ఉంద‌న్నారు.

దీనికి కార‌ణం.. మోడీ హ‌యాంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంద‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డ‌మేన‌ని చంద్ర‌బాబు చెప్పారు. హ‌రియాణాలో హ్యాట్రిక్ విజ‌యానికి కృషి చేసిన ప్ర‌ధాని మోడీ, బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు తాను కృత‌జ్ఞ‌తలు తెలిపిన‌ట్టు పేర్కొన్నారు. మంచి చేసిన ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు 48 సీట్లు ఇచ్చి మ‌రోసారి అధికారం క‌ట్ట‌బెట్టార‌ని తెలిపారు. విధ్వంస‌కారుల‌ను ప్ర‌జ‌లు ఎలా ఇంటికి పంపించారో అంద‌రికీ తెలిసిందేన‌ని ప‌రోక్షంగా వైసీపీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌మ్ము క‌శ్మీర్‌లోనూ బీజేపీ మంచి ఓటు బ్యాంకును సొంతం చేసుకుని మెరుగైన సీట్ల‌లో విజ‌యం ద‌క్కించుకుంద‌న్నారు.

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న‌ మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని చంద్ర‌బాబు జోస్యం చెప్పారు. అభివృద్ధికి ప్ర‌జ‌లు ఖ‌చ్చితంగా ప‌ట్టం క‌డ‌తార‌ని తెలిపారు. ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. త్వ‌ర‌లోనే 3వ స్థానానికి చేరుతుంద‌ని తెలిపారు. ప్ర‌ధాని మోడీ వ్యూహాలు, కేంద్ర ప‌రిపాల‌న‌, నిర్ణ‌యాలు వంటివి ప్ర‌పంచం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంద‌ని తెలిపారు. అదే ఉత్సాహంతో ఏపీ కూడా అడుగులు వేస్తుంద‌ని చెప్పారు.

5వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, మోదీ పాలనతో త్వరలోనే మూడో స్థానానికి వస్తుంది. విజన్ వికసిత్ భారత్ 2047తో భారత్ తొలి లేక రెండో ఆర్థిక వ్యవస్థగా మారుతుందని’ దీమా వ్యక్తం చేశారు.“దేశంలో మాన‌వ వ‌న‌రులు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇది అభివృద్దికి చోద‌క శ‌క్తిగా మారుతుంది. మ‌న‌కు కూడా యువ శ‌క్తి ఎక్కువ‌గా అందుబాటులో ఉంది. వీరిని ప్రోత్స‌హిస్తే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న న‌మ్మ‌కం విశ్వాసం నాకు ఉన్నాయి. 2047లో భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా మారుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.