బిగ్ న్యూస్ : విశాఖ‌కు టీసీఎస్‌.. ఫ‌లించిన లోకేష్ కృషి

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫ‌లించింది. ఆయ‌న మంగ‌ళ‌వారం బెంగ‌ళూరులో టాటా స‌న్స్ చైర్మ‌న్ ఎం చంద్ర‌శేఖ‌ర‌న్‌తో భేటీ అయిన త‌ర్వాత‌.. బుధ‌వారం తీపి క‌బురు చెబుతానంటూ ట్వీట్ చేశారు. అన్న‌ట్టుగానే బుధ‌వారం నారా లోకేష్ సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్‌(టీసీఎస్‌)ను ఒప్పించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ క్ర‌మంలో విశాఖ‌లో టీసీ ఎస్‌ను  ఏర్పాటు చేసేందుకు టాటా ముందుకు వ‌చ్చిన‌ట్టు చెప్పారు.

ఈ టీసీఎస్‌తో 10 వేల ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని నారా లోకేష్ పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖ కీర్తి ప్ర‌పంచ దేశాల‌కు కూడా విస్త‌రిస్తుంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ గతాన్ని మ‌న‌నం చేసుకున్నారు. తాను నిర్వ‌హించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో అనేక మంది చ‌దువుకున్న యువ‌త త‌మ బాధ‌లు వెల్ల‌డించార‌ని పేర్కొన్నారు. ఉన్న‌త చ‌దువు చ‌దివి పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి వ‌స్తోంద‌ని.. దీంతో కుటుంబాల‌కు దూరంగా ఉంటున్నామ‌ని, ఇక్క‌డికే కంపెనీల‌ను తీసుకువ‌చ్చే ఏర్పాటు చేయాల‌ని వారు కోరిన‌ట్టు తెలిపారు.

ఆ స‌మ‌యంలో తాము అధికారంలోకి వ‌స్తే.. త‌ప్ప‌కుండా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్స‌హిస్తామ‌ని తాను మాటిచ్చిన ట్టు తెలిపారు. ఆనాడు ఇచ్చిన మాట ప్ర‌కారం.. తాజాగా సీటీఎస్ కంపెనీని ఒప్పించాన‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని ప్ర‌ఖ్యాత ఐటీ కంపెనీలు ర‌ప్పించి ల‌క్ష‌లాది మందికి స్థానికంగా ఉపాధి క‌ల్పిస్తామ‌ని నారా లోకేష్ పేర్కొన్నారు.  ఇదిలావుంటే, మంగ‌ళ‌వా రం నాటి భేటీలో ఏపీలో టీసీఎస్ ఏర్పాటు చేస్తే.. క‌ల్పించే సౌక‌ర్యాల‌ను నారా లోకేష్ వివ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా విశాఖ‌లో కంపెనీని ఏర్పాటు చేసేందుకు సీటీఎస్ ముందుకు వ‌చ్చింది. అదేవిధంగా ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్‌(ఈవీ), ఎయిరో స్పేస్‌, స్టీల్, హోట‌ల్స్, టూరిజం రంగాల్లో కూడా టాటా గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే అవ‌కాశం ఉంది.