సాక్షి పత్రికపై టీటీడీ కేసు

కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సీబీఐ నేతృత్వంలో సిట్ ను నియమించింది. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పాటు చేసిన సిట్ పై తమకు నమ్మకం ఉందని కేంద్రం కూడా అభిప్రాయపడింది.

అయితే, తాజాగా ఈ వ్యవహారంపై సాక్షి పత్రికలో ఏపీ సీఎం చంద్రబాబుకు డ్యామేజ్ కలిగించే లాగా వార్తలు రాయడం సంచలనం రేపింది.

ఈ క్రమంలోనే తాజాగా సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు అయింది.

టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని టీటీడీ చేసిన ఫిర్యాదు ప్రకారం ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. తిరుమల పర్యటనలో టీటీడీ అధికారులతో చంద్రబాబు నిర్వహించిన సమీక్ష గురించి ఆ పత్రికలో అసత్య కథనం ప్రచురితమైందని తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘నేను చూసుకుంటా’ అనే శీర్షికతో ఈనెల 6వ తేదీన సాక్షి పత్రిక 13వ పేజీలో ఒక కథనం ప్రచురితమైందని, అందులో అన్ని అసత్యాలే ఉన్నాయని పోలీసులకు డిప్యూటీ ఈవో ఫిర్యాదు చేశారు. తిరుపతి లడ్డు కోసం వాడిన నెయ్యి విషయంలో మన స్టాండ్ మీకు తెలుసు కదా, సిట్ బృందం విచారణకు వస్తే అందరూ ఒకే మాట చెప్పాలని, ఆ రకంగా అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని సమీక్షకు హాజరైన అధికారులకు చంద్రబాబు సూచించినట్లు ఆ కథనంలో ప్రచురించారు. ఉద్దేశపూర్వకంగానే అసత్యాలను ప్రచురించిన సాక్షి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఈవో లోకనాథం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.