మోడీ తరఫున కేజ్రీవాల్ ప్రచారం..కండిషన్స్ అప్లై!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టై ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తాజాగా ప్రధాని మోడీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాను చెప్పిన పని మోడీ చేస్తే బీజేపీ తరఫున తాను ప్రచారం చేస్తానని క్రేజీ ఆఫర్ ఇచ్చారు కేజ్రీవాల్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ ఇస్తే తాను బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని సవాల్ విసిరారు కేజ్రీవాల్. ఢిల్లీ ఎన్నికలకు ముందు ఉచిత విద్యుత్ ఇవ్వాలని షరతు పెట్టారు. ఢిల్లీలోని ఆప్ సర్కార్ 200 యూనిట్లులోపు విద్యుత్ వినియోగించేవారికి ఉచితంగా విద్యుత్ అందజేస్తోన్న సంగతి తెలిసిందే.

ఢిల్లీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, లెఫ్లినెంట్ గవర్నర్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే డబుల్ లూట్ అని, యూపీలో ఏడేళ్లుగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శఇంచారు. ప్రధాని మోడీ పదేళ్ల పాలనపై కేజ్రీవాల్ పలు ప్రశ్నలు లేవనెత్తారు.

పదేళ్లలో బీజేపీ పాలకులు ఏమీ చేయలేదని, ఏమీ చేయలేదు. ప్రధాని మోడీకి 2025 నాటికి 75 ఏళ్లు నిండుతాయని, అప్పటికైనా ప్రజలకు ఏమైనా చేయాలని హితవు పలికారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అని కేజ్రీవాల్ ఆరోపించారు.

హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలకు ప్రజలకు చరమగీతం పాడతారని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వాలకు ఎదురుగాలి వీస్తుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు సగానికి తగ్గాయని, హర్యానా, మణిపూర్‌లో 7 సంవత్సరాల పాటు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నా ఉపయోగం లేదని, రెండేళ్లుగా మణిపూర్ మండుతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు.