జ‌గ‌న్ ప్ర‌భుత్వ కుర్చీలు దొంగిలించాడు: లోకేష్

కొత్త సీసాలో పాత సారా! అనే సామెత‌ను వైసీపీ, టీడీపీలు మ‌రోసారి నిరూపిస్తున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితా లు వ‌చ్చిన జూన్ 4 త‌ర్వాత తొలిసారి ఒక కీల‌క వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఫ‌స్టు ఫ‌స్టు.. ఈ వివాదంతోనే రెండు పార్టీలు విమ‌ర్శ‌లు కూడా చేసుకున్నాయి. అదే.. ఫ‌ర్నిచ‌ర్ ర‌గ‌డ. అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. అప్ప‌ట్లో వైసీపీ అధికారం దిగిపోయిన త‌ర్వాత‌.. కోటిన్న‌ర రూపాయ‌ల విలువ చేసే ఫ‌ర్నిచ‌ర్‌ను త‌న ద‌గ్గ‌రే ఉంచేసుకుంద‌ని.. క్యాంపు కార్యాల‌యంలో మ‌రో రెండు కోట్ల రూపాయ‌లు పెట్టి హంగామా చేసుకు న్నార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శించారు.

ఇది రాజ‌కీయంగా అప్ప‌ట్లో ర‌చ్చ‌కు దారి తీసింది. ఫ‌ర్నిచ‌ర్ దొంగ‌లు అంటూ వైసీపీ నేత‌ల‌పై టీడీపీ ఫైర్ బ్రాండ్లు కొంద‌రు ర‌చ్చ చేశారు. చివ‌ర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌(జీఏడీ) అధికారులు జోక్యం చేసుకుని.. వైసీపీ కార్యాల‌యానికి లేఖ రాశారు. ఫ‌ర్నిచ‌ర్‌ను అప్ప‌గించండి అని పేర్కొన్నారు. అయితే.. దీనికి ముందే.. వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా లేఖ రాశారు. మీకు కావాలంటే ఫ‌ర్నిచ‌ర్ తీసుకువెళ్లండి.. లేక‌పోతే ఇంత కావాల‌ని లెక్క‌గ‌డితే .. ఆ సొమ్మునైనా ఇచ్చేస్తాం అని తేల్చి చెప్పారు.

ఆ త‌ర్వాత‌.. ఈ వ్య‌వ‌హారం మాయ‌మైంది. ఇంత‌లో ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య చోటు చేసుకున్న క్షేత్ర‌స్థా యి వివాదాలు, పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి జైలు, తాడిప‌త్రిలో జేసీ వ‌ర్సెస్ పెద్దారెడ్డి వివాదాల నేప‌థ్యంలో ఫ‌ర్నిచ‌ర్ సంగ‌తిని అంద‌రూ మ‌రిచిపోయారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఈ విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్పుడు వైసీపీనే ముందుగా స్పందించింది. లేళ్ల అప్పిరెడ్డి తాజాగా మ‌రో లేఖ సంధించారు. మీరు తీసుకుంటామ‌ని చెప్పిన ఫ‌ర్నిచ‌ర్‌ను ఎందుకు తీసుకోలేదు.. అని కూడా ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టికే తాము నాలుగు సార్లు లేఖలు రాశామ‌ని అయినా.. స‌ర్కారు స్పందించ‌లేద‌ని అప్పిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు.. త‌మ‌పై నింద‌లు మోపేందుకు ఇలా తాత్సారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్ దాదా 40 దొంగ‌లు అంటూ ఆయ‌న ఎదురు దాడి చేశారు. ప్ర‌జ‌లు కుర్చీ దింపేసినా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ కుర్చీలు దొంగిలించాడ‌ని.. అన్నారు. దీంతో ఇప్పుడు మ‌రోసారి ఫ‌ర్నిచ‌ర్ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌రి ఇప్ప‌టికైనా దీనికి ముగింపు ప‌లుకుతారో.. లేక సాగ‌దీస్తారో చూడాలి.