అమాయకుడ్ని.. ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న సజ్జల రిక్వెస్టు

కాలం కంటే శక్తివంతమైనది మరొకటి ఉండదు. ఎలాంటి వాడినైనా ఇట్టే ప్రభావితం చేసే సత్తా దాని సొంతం. తమ మాటకే కాదు తన చూపుకు సైతం తిరుగులేనంత పవర్ ప్రదర్శించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిన వైనం వెలుగు చూసింది. తాను అమాయకుడినని.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టును అభ్యర్థిస్తున్న వైనం వెలుగు చూసింది.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై మూకుమ్మడి దాడి చేయటం.. విధ్వంసాన్ని క్రియేట్ చేసిన వైనంపై కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కేసు విచారణ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా.. మరికొందరి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఈ కేసులో 120వ నిందితుడిగా గత ప్రభుత్వంలో కీలక పదవిలో ఉంటే.. ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామక్రిష్ణారెడ్డిని చేర్చారు.

ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన.. ఈ కేసులో సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను నిందితుడిగా చేర్చారన్నారు.

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వైసీపీ నేతల్ని, కార్యకర్తల్ని వేధిస్తున్నారన్న ఆయన.. తనపైనా కేసు పెట్టారన్నారు. సీఆర్ పీసీ సెక్షన్ 41ఏ నోటీసు రూల్ ప్రకారం తాను రక్షణ పొందకుండా అడ్డుకునేందుకే తనపై హత్యాయత్నం సెక్షన్ ను చేర్చారన్నారు. తాను అమాయకుడినని.. తాను కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటానని.. మందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసు విచారణ ఈరోజు హైకోర్టు ఎదుట రానుంది. దీనిపై రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.