సబిత‌ ఫామ్‌హౌస్‌ కూలగొట్టాలా? వద్దా?: రేవంత్

బీఆర్ ఎస్‌ నాయ‌కురాలు, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డిపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఫామ్ హౌస్‌లు కూడా ఆక్ర‌మ‌ణల జోన్‌లో ఉన్నాయ‌ని.. వాటిని కూడా కూల‌గొట్టాలా? వ‌ద్దా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. “సబితమ్మ ముగ్గురు కొడుకులకు ఫామ్‌హౌస్‌లు లేవా?” అని ప్ర‌శ్నించారు. అవి కూడా బ‌ఫ‌ర్ జోన్‌లోనే ఉన్నాయ‌ని త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో వాటిని కూల‌గొట్టాల్నో వ‌ద్దో మీరే చెప్పండి అని బీఆర్ఎస్ నాయ‌కుల‌ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు.

మ‌రోవైపు మాజీ మంత్రి హ‌రీష్‌రావుపై సీఎం రేవంత్ ఫైర‌య్యారు. “నీ ఫామ్‌హౌస్‌ల లెక్క కూడా ఉంది” అని వ్యాఖ్యానించారు. హరీష్‌రావుకు అజిజ్‌పూర్‌లో ఫాంహౌస్‌ ఉందని, అది కూడా అక్ర‌మ నిర్మాణ‌మేన ని సీఎం చెప్పారు. వాటిపైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఇక‌, “బావ, బామ్మర్దులు కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారు. మూసీని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు బతుకుతారు?” అని ప్ర‌శ్నించారు. మూసీ ప్ర‌క్షాళ‌న‌కు వ్య‌తిరేకంగా బీఆర్ఎస్ నేత‌లు చేస్తున్న ఆందోళ‌న‌ను పెయిడ్ ధ‌ర్నాగా సీఎం పేర్కొన్నారు.

స‌బిత్ కౌంట‌ర్

కాగా, సీఎం రేవంత్ వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. త‌మ‌కు మూడు ఫాం హౌస్‌లు ఎక్క‌డ ఉన్నాయో చెప్పాల‌ని నిల‌దీశారు. ప్ర‌స్తుతం త‌న కుమారుడు ఇల్లు క‌ట్టుకుంటున్నాడ‌ని.. అది మిన‌హా త‌మ‌కు ఎక్క‌డ ఫామ్ హౌస్‌లు ఉన్నాయో చెప్పాల‌న్నారు. త‌మ‌కు, త‌మ కుటుంబానికి ఆత్మా భిమానాన్ని మించిన ఆస్తిలేద‌న్నారు. రేవంత్ వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ స‌మాజం గుర్తిస్తోంద‌ని తెలిపారు. తాను ఎవ‌రినీ దేబిరించ‌లేద‌న్నారు.

అదేవిధంగా త‌న నోరు నొక్కేందుకు.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున ముఖ్య‌మంత్రిని, కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించకుండా ఉండేందుకు త‌న‌పై వ్య‌క్తిగ‌తంగా రేవంత్‌రెడ్డి దాడి చేస్తున్నార‌ని స‌బిత విమ‌ర్శించారు. అయితే.. తాను రాజ‌కీయంగా అనేక ఎదురు దెబ్బ‌లు తిని ఉన్నాన‌ని.. ఇలాంటివాటిని ప‌ట్టించుకునే ప్ర‌శ్నే లేద‌ని వ్యాఖ్యానించారు. స‌మాజంలోను, రాజ‌కీయాల్లోనూ తాము గౌరవంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని చెప్పారు.