బాబు నమ్మిన కొద్ది మందే హ్యాండిస్తున్నారే

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏ విష‌యంలో అయినా ఆచితూచి అడుగులు వేస్తార‌నే పేరు తెచ్చుకున్నారు. అంత తేలిక‌గా ఎవ‌రినీ న‌మ్మే నాయ‌కుడు కూడా కార‌ని పేరుంది. అయితే, ఆయ‌న సాహ‌సం చేసిన న‌మ్మిన వారిలో చాలా మంది నాయ‌కులు ఆయ‌న‌కు హ్యాండివ్వ‌డ‌మే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును పొందిన కుటుంబం కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఈలి ఫ్యామిలీ. ఈలి ఆంజ‌నేయులు, వ‌ర‌ల‌క్ష్మిలు తాడేప‌ల్లి గూడెం నుంచి ప‌లుమార్లు గెలుపు గుర్రం ఎక్కారు.

గ‌తంలో ఈలి ఆంజ‌నేయులు మంత్రిగా కూడా ప‌నిచేశారు. అయితే, వీరి కుమారుడు ఈలి నాని విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. టీడీపీలో కీల‌కంగా ఈ కుటుంబంలో నాని బ‌య‌ట‌కు వ‌చ్చి.. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీలో చేరారు. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీ త‌ర‌ఫున 2009లో తాడేప‌ల్లిగూడెం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇంత‌వ‌ర‌కు సాఫీగానే సాగింది. కానీ, ప్ర‌జారాజ్యం ఎప్పుడైతే.. కాంగ్రెస్‌లో విలీనం అయిందో.. అప్పుడు ఇక‌.. ఈలినానికి క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌జారాజ్యంతో పాటు కాంగ్రెస్‌లోకి వెళ్లినా.. ఆయ‌న‌ను అక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

దీంతో విధిలేని ప‌రిస్థితిలో నాని మ‌ళ్లీ టీడీపీ గూటికి చేరారు. చంద్ర‌బాబు.. యువ‌కుడు, ఉత్సాహ‌వంతుడు.. అంటూ గ‌తాన్ని మ‌రిచి పార్టీ కండువా క‌ప్పారు. అయితే, 2014లో టీడీపీ త‌ర‌ఫున తాడేప‌ల్లిగూడెం టికెట్‌ను ఆశించినా.. బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో నాని సైలెంట్ అయ్యారు. పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో యాక్టివ్‌గానే వ్య‌వ‌హ‌రించారు. ఈ ప‌రిణామానికి తోడు గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు లేక‌పోవ‌డంతో గ‌త ఏడాది తాడేప‌ల్లిగూడెం టికెట్‌ను చంద్ర‌బాబు నానికే ఇచ్చారు. అయితే.. జ‌గ‌న్ సునామీ దెబ్బ‌తో నాని ఓట‌మిపాల‌య్యారు.

ఇక‌, అప్ప‌టి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు వైసీపీ నాయ‌కుడు, మంత్రి శ్రీరంగ‌నాథ‌రాజుతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నార‌ని జిల్లా నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. నిజానికి ఈలి నానిని చంద్ర‌బాబు నెత్తిన పెట్టుకున్నార‌ని, గ‌త ఏడాది ఈ టికెట్ కోసం మాజీ జెడ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు ప‌ట్టుబ‌ట్టినా.. ఆయ‌న‌కు ఇవ్వ‌కుండా నానికి ఇచ్చార‌ని, అలాంటి నాని ఇలా చేయ‌డం స‌రికాద‌ని స్థానిక టీడీపీ సీనియ‌ర్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.