‘బాబ్రీ’ కేసులో నిందితులంతా నిర్దోషులే

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, రాజకీయ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ సహా 49 మంది నిందితులు నిర్దోషులేనని లక్నో సీబీఐ కోర్టు కీలక తీర్పునిచ్చింది. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ కేసులో నిందితులపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది.

నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని, కాబట్టి నిందితులంతా నిర్దోషులేనని కోర్టు ప్రకటించింది. వారంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న ఆధారాలు లేవని, అందుకే కేసు కొట్టివేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ కేసు తీర్పు సమయంలో నిందితులంతా కోర్టులో హాజరు కావాలని జడ్జి గతంలో ఆదేశించారు. అయితే, రకరకాల కారణాల వల్ల బ్రతికి ఉన్న 32 మంది నిందితులలో 11 మంది హాజరుకాలేదు.

ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులుండగా విచారణ సమయంలో 17 మంది మృతి చెందారు. 92 సంవత్సరాల అద్వానీ, 86 ఏళ్ల జోషిలకు, వారి వృద్ధాప్యం దృష్ట్యా, కోర్టుకు రానవసరం లేదని ఇప్పటికే న్యాయమూర్తి తెలిపారు. ఇక ఉమాభారతికి కరోనా సోకడంతో ఆమె ఆసుపత్రిలో ఉన్నారు. మరో సీనియర్ నేత కల్యాణ్ సింగ్ కరోనా నుంచి కోలుకుంటున్నారు.

1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన ఘటన పెను సంచలనం రేపింది. అద్వానీ చేపట్టిన రథయాత్ర, ఆపై 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత, దాని తరువాత జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 3 వేల మంది ప్రాణాలను కోల్పోయారు.

అద్వానీ మురళీమనోహర్‌ జోషి వంటి బీజేపీ నేతలతో పాటు సంఘ్‌పరివార్‌ నేతలు ప్రజలను రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వచ్చాయి. సీబీఐ ఈ కేసులో విచారణ జరిపిన తర్వాత కొన్నేళ్ల కింద పలువురు నేతలపై నేరపూరిత కుట్ర అభియోగాలను సీబీఐ న్యాయస్థానం తొలగించింది. అయితే, ఆ తర్వాత మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ అభియోగాలను కొనసాగించి విచారణ జరిపారు. ఈ క్రమంలోనే ఈ కేసుపై విచారణ జరిపిన లక్నో సీబీఐ కోర్టు…. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని తీర్పునిచ్చింది.