రేవంత్‌కు ఏబీఎన్ రాధాకృష్ణ వార్నింగ్

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో.. హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేత ఒకటి. సీఎం సూచనలతో హైడ్రా చాలా దూకుడుగా అక్రమ కట్టడాలను కూల్చి వేస్తూ దూసుకెళ్తోంది.

సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన వందల కోట్ల విలువ చేసే ఎన్ కన్వెన్షన్ సహా పలు కట్టడాలను నిబంధనలను అతిక్రమించి నిర్మించారనే కారణంతో హైడ్రా కూల్చి వేసింది. ఐతే బడా బాబుల నిర్మాణాలను కూల్చి వేస్తున్నపుడు జనం నుంచి సానుకూల స్పందనే వచ్చింది కానీ.. సామాన్యుల జోలికి వచ్చేసరికి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలిసో తెలియకో వీళ్లు నిబంధనలను అతిక్రమించి ఉండొచ్చు. కానీ జీవితాంతం కూడబెట్టుకున్న డబ్బుతో కట్టుకున్న ఇళ్లను కూల్చి వేస్తుండడంతో ఒక్కసారిగా వారి జీవితాలు తలకిందులు అవుతున్నాయన్న మాట వాస్తవం.

దీనిపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి గట్టి మద్దతుదారుగా పేరున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ దీనిపై స్పందించారు.

ఆక్రమణల పేరిట వేలాది ఇళ్లు కూల్చడం ప్రజల్లో వ్యతిరేకకు దారి తీస్తుందని నిర్మొహమాటంగా చెప్పేశారు ఆర్కే. హైడ్రా చర్యల వల్ల ఏ పాపం తెలియని వాళ్లు నిరాశ్రయులవుతున్నారని.. ఫాం హౌజ్‌లను, అతిథి గృహాలను నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తే కూల్చినా పర్వాలేదు కానీ.. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని మధ్య తరగతి వారు నిర్మించుకున్న ఇళ్లను.. అది కూడా దశాబ్దాల కిందటి వాటిని కూల్చడం మంచిది కాదని ఆర్కే అన్నారు.

మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనుకోవడంలో తప్పు లేదని.. కానీ దశాబ్దాలుగా దాని పరిధిలో ఆక్రమణలు జరిగాయని.. వేలాది ఇళ్ల నిర్మాణం జరిగిందని.. ఇప్పుడు ఉన్నట్లుండి అన్నింటినీ తొలగించడం సాధ్యం కాదని ఆర్కే చెప్పారు.

మూసీ ప్రాజెక్టును ప్రజలు కోరుకోలేదనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బడా బాబుల ఫాం హౌప్‌లను కూల్చినపుడు జనాల్లో సానుకూల స్పందన వచ్చిందని.. కానీ ఇప్పుడు సామాన్యులు రోడ్డున పడుతున్న దృశ్యాలు చూసి వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. చెరువులు, జలాశయాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ణయించకుండా.. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సమర్థనీయం కాదని.. రేవంత్ వెంటనే కూల్చివేతలకు విరామం ప్రకటించి పరిస్థితిని సమీక్షించకుంటే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుందని ఆర్కే అభిప్రాయపడ్డారు.