తీగ దొరికింది డొంక ప్యాలెస్‌లో వుంది: ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం డా ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కోట్లు కొల్ల‌గొట్టిన ఘ‌నాపాఠి.. ప్యాలెస్ దోపిడీ బ‌ట్ట‌బ‌య‌లు కావాలి.. అంటూ వ్యాఖ్యానించారు.

తాజాగా గ‌నుల శాఖ మాజీ డైరెక్ట‌ర్‌(జ‌గ‌న్ హ‌యాంలో ప‌నిచేసిన‌) వెంక‌ట‌రెడ్డిని అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాల‌నా కాలంలో ఇసుక నుంచి గ‌నుల వ‌ర‌కు దోపిడీ జ‌రిగింద‌ని, కొంద‌రికే ఆయ‌న అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది.

సుమారు 2,566 కోట్ల రూపాయ‌ల మేర‌కు గ‌నులలో దోపిడీ జ‌రిగిన‌ట్టు స‌ర్కారు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో దీనికి పాత్ర ధారిగా ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అప్ప‌టి డైరెక్ట‌ర్ వెంక‌ట‌రెడ్డిని అతి క‌ష్టం మీద అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై పీసీసీ చీఫ్ ష‌ర్మిల తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

గ‌నుల దోపిడీలో తీగ మాత్ర‌మే దొరికింది. డొంక‌లు క‌ద‌లాల్సి ఉంది. ఆ డొంక ఏ ప్యాలెస్‌లో ఉందో అంద‌రికీ తెలిసిందే. కోట్లు కొల్ల గొట్టిన ఘ‌నాపాఠీ ఎవ‌ర‌నేది కూడా అంద‌రికీ తెలుసు అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. 2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డి అయితే, సూత్ర‌ధారిగా అన్నీ తానై రూ.వేల కోట్లు కొల్లగొట్టిన ఘనాపాఠి ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు.

గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్రంలో ప్ర‌కృతి సంప‌ద‌ను దోచుకున్నార‌ని, త‌మ వారికి, అయిన వారికంపెనీల‌కు గ‌నుల‌ను దోచి పెట్టార‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు. క‌నీస నిబంధ‌న‌లు కూడా పాటించ‌లేద‌న్నారు. జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ నిబంధ‌న‌ల‌ను కూడా పాటించ‌లేద‌న్నారు.

రాష్ట్ర ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయ‌లను త‌మ సొంత ఖజానాకు తరలించుకున్నారంటూ.. ప‌రోక్షంగా మాజీ జ‌గ‌న్‌పై ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు. మైనింగ్ కుంభ‌కోణంపై పూర్తిస్థాయి విచార‌ణ చేసి.. తిమింగ‌లాల‌ను ప‌ట్టుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు. అవ‌స‌ర‌మైతే.. సీబీఐ ద‌ర్యాప్తును కూడా చేయించాల‌ని ష‌ర్మిల సూచించారు.