లడ్డూ కల్తీ..వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

తిరుపతి లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని ల్యాబ్ ఇచ్చిన అధికారిక నివేదిక ప్రకారం చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారు.

గతంలో కూడా కొందరు భక్తులు లడ్డు నాణ్యతపై, శుభ్రతపై ఫిర్యాదు చేయడంతో ల్యాబ్ కు పంపించి లడ్డు నాణ్యతను పరీక్షించడంతో ఈ విషయం బట్టబయలైంది. అయితే, తిరుపతి లడ్డు పై చంద్రబాబు చేస్తున్నది దుష్ప్రచారం అని, తిరుమల వెంకన్నను అడ్డుపెట్టుకుని ఆయన రాజకీయాలు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు ప్రత్యారోపణలకు దిగారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై, వైసీపీ నేతల ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఎంతో పవిత్రమైన, విశిష్టత కలిగిన తిరుపతి లడ్డూను కల్తీ చేయడమే కాకుండా ఆ కల్తీని ప్రశ్నించిన తమపై జగన్, వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తారా అని ఆయన ఫైర్ అయ్యారు.

గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పినా ఆ పార్టీ నేతల బుద్ధి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడుతానని, స్వామికి అపచారం తలపెట్టే మాటలు పొరపాటున కూడా మాట్లాడనని చంద్రబాబు అన్నారు.

వాస్తవాలు వెల్లడించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న బాధ తనకు కూడా ఉందని, కానీ అలా అని గత పాలకులు చేసిన దుర్మార్గాలను బట్టబయలు చేయకుండా చూస్తూ ఊరుకోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. 200 ఏళ్ల పైబడిన చరిత్ర తిరుమలకు ఉందని, ఇంట్లో తిరుపతి లడ్డు ఉంటే ఇల్లంతా కమ్మటి వాసన ఘుమఘుమలాడేదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తిరుపతి లడ్డు విషయంలో, అక్కడి ఆహార పదార్థాల శుభ్రత, నాణ్యత విషయంలో రాజీ పడబోమని అన్నారు. గతంలో వాటి విషయంలో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆ తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని, వారిని కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు చెప్పారు.

మరోవైపు, ప్రతి నెల 1వ తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకొని సాయం అందించాలని సూచించారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలోని మద్దిరాలపాడు గ్రామంలో స్థానికులతో చంద్రబాబు ఇష్టాగోష్టి నిర్వహించారు.