లడ్డు గొడవ.. చాలా దూరం వెళ్లిపోయింది

మొన్న ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం సందర్భం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు నాణ్యత దెబ్బ తినడంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. లడ్డులో వాడిన నెయ్యిలో జంతు కొవ్వులు వాడినట్లుగా ఆయన చేసిన ఆరోపించడం ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చగా మారింది.

ముందు ఈ ఆరోపణలను మామూలుగానే చూశారు, తెలుగు రాష్ట్రాల వరకే దీని గురించి కొంత చర్చ జరిగింది. కానీ ఒక్క రోజు గడిచేసరికి వ్యవహారం మారిపోయింది. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిందా.. లేక అక్కడి మీడియానే దీని మీద దృష్టిసారించిందా అన్నది స్పష్టత లేదు కానీ.. గురువారం రాత్రి నుంచి ఈ గొడవ జాతీయ అంశంగా మారిపోయింది.

కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా తిరుమల లడ్డులో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నట్లుగా నిరూపించే ల్యాబ్ రిపోర్టులను టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి బయటపెట్టడంతో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం సాయంత్రం నుంచే జాతీయ స్థాయిలో తిరుమల లడ్డు టాపిక్ ట్రెండ్ అయింది. ఒక దశలో ఇండియాలో నంబర్ వన్ టాపిక్‌గా మారింది. దీంతో పాటుగా జగన్ పేరు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది.

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 50 ఏళ్ల నుంచి సరఫరా చేస్తున్న నాణ్యమైన నందిని నెయ్యిని పక్కన పెట్టి వేరే వ్యక్తులకు కాంట్రాక్టునివ్వడంతో నాణ్యతను పట్టించుకోవడం మానేశారని.. దీంతో లడ్డు క్వాలిటీ దెబ్బ తిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. రిపబ్లిక్ టీవీ, ఎన్డీటీవీ.. ఇలా వరుసగా జాతీయ టీవీ ఛానెళ్లు ఈ అంశం మీద చర్చలు పెట్టడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశం అయింది. తిరుమల శ్రీవారిని దేశవ్యాప్తంగా భక్తులు ఎలా కొలుస్తారో తెలిసిందే. ఇక్కడి లడ్డును పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి ప్రసాదం విషయంలో తప్పు జరిగిందని తెలిసేసరికి తట్టుకోలేక వైసీపీ మీద సామాజిక మాధ్యమాల్లో హిందువులు విరుచుకుపడుతున్నారు.