వంద రోజుల ఉత్సాహం.. త‌మ్ముళ్ల‌ ‘దాహం తీరన‌ట్టే’ !

కూట‌మి స‌ర్కారుకు వంద రోజులు పూర్త‌య్యాయి. సంతృప్తి విష‌యంలో కూట‌మి పార్టీల నాయకులు త‌ల కోమాట మాట్లాడుతున్నారు. ఇదేంటి? అంటున్నారా? అవును! నిజ‌మే. ఎవ‌రు ఎలా ఉన్నా.. టీడీపీ నాయ కులు మాత్రం ఒకింత నిరుత్సాహంతోనే ఉన్నారు.

గ‌త ఐదేళ్ల‌లో ముఖ్యంగా చివ‌రి మూడేళ్ల‌లో టీడీపీ అనేక ఇక్క‌ట్లు ఎదుర్కొంది. అనేక కేసులు పెట్టించుకున్న నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే.. “ఇంత‌కు ఇంత క‌సి తీర్చుకుంటాం. మీరు ఎంత‌వ‌రకైనా వెళ్లండి!” అని అప్ప‌ట్లో టీడీపీ సీనియ‌ర్లు చెప్పుకొచ్చారు.

దీంతో చాలా మంది క్షేత్ర‌స్థాయి నాయ‌కులు వైసీపీ నేత‌ల‌పై పోరాటాలు చేశారు. ఈ క్ర‌మంలోనే అనేక మందిపై కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికీ ప‌దుల సంఖ్య‌లో త‌మ్ముళ్లు అన్ని జిల్లాల‌కు చెందిన వారు జైళ్ల‌లోనే మ‌గ్గుతున్నారు.

త‌మ ప్ర‌భుత్వం వ‌స్తుంది.. బ‌య‌ట‌కు తెస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌భుత్వం వ‌చ్చింది.. కానీ, వారు ఇంకా రాలేదు. క‌నీసం బెయిళ్లు కూడా ద‌క్క‌ని వారు ప‌దుల సంఖ్య‌లోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా కుటుంబాల‌కు చెందిన‌వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ఇదే విష‌యాన్ని పార్టీ రాష్ట్ర చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావుకు అన్న‌మ‌య్య జిల్లాకు చెందిన టీడీపీ కుటుంబాలు విన్న‌వించాయి. అప్ప‌ట్లో అంగ‌ళ్లు వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌లో త‌మ వారు అరెస్ట‌యి.. ఇంకా జైళ్ల లోనే ఉన్నార‌ని.. వారు బ‌య‌ట‌కు రాలేద‌ని తెలిపారు.

సుమారు 30 కుటుంబాలు మంగ‌ళ‌వారం ప‌ల్లాకు ఇదే విష‌యంపై విన‌తులు ఇచ్చారు. అంటే.. వీరంతా అసంతృప్తితోనే ఉన్నారు. ఇక‌, వైసీపీపై క‌సి తీర్చుకోవాల‌న్న నాయ‌కులు మ‌రికొంద‌రు ఉన్నారు.

అంటే.. వైసీపీ కీల‌క నాయ‌కులు, మాజీ మంత్రుల‌ను అరెస్టు చేయాల‌ని.. వారు అప్ప‌ట్లో చేసిన నేరాల‌ను వెలికి తీయాల‌ని కోరుతున్నారు. కానీ, ఇవ‌న్నీ చ‌ట్ట‌బ‌ద్ధంగానే జ‌రుగుతాయ‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు చెబుతున్నారు.

కానీ, త‌మ్ముళ్లు మాత్రం అప్ప‌ట్లో చట్టాల‌ను చూసే త‌మ‌పై కేసులు పెట్టారా? అంటూ మూతులు తిప్పుకొంటున్నారు. అంటే.. ఒక ర‌కంగా.. పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. తాము ఆశించిన విధంగా లేక పోతే తాము ఇబ్బందులు ప‌డిన‌ట్టుగా.. వైసీపీని ఇర‌కాటంలో పెట్ట‌లేక పోతున్నార‌న్న భావ‌న మాత్రంఉంది. అందుకే.. టీడీపీ నేత‌ల్లో ఒకింత జోష్ త‌గ్గింద‌నే చెప్పాలి.