విజయసాయి రెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలన్న హైకోర్టు

గడిచిన కొంతకాలంగా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయి రెడ్డి కుటుంబానికి చెందిన ఒక అక్రమ నిర్మాణంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే న్యాయస్థానానికి వెళ్లారు. విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన కట్టడంపై అభ్యంతరాలు ఉన్నాయి. భీమిలి బీచ్ సముద్రానికి అతి సమీపంలో.. సీఆర్ జెడ్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాన్ని కూల్చేసేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారికి షాకిచ్చే ఆదేశాల్ని హైకోర్టు జారీ చేసింది.

అంతేకాదు.. రాజకీయ జోక్యంతో కూల్చివేత చర్యల్ని అపొద్దని పేర్కొంది. నిర్మాణాల కూల్చివేతలపై స్టే ఉత్తర్వులు అవసరం లేదన్న న్యాయస్థానం.. ‘మీ పని మీరు చేయండి’ అంటూ అధికారులకు సూచన చేసింది. ఈ అక్రమ నిర్మాణంపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో పాటు స్థాయి నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అదే సమయంలో కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ నేహారెడ్డి తరఫు లాయర్ కోరగా.. అందుకే హైకోర్టు నో చెప్పింది.

నేహా రెడ్డి అక్రమ నిర్మాణంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. నేహారెడ్డి తరఫు సీనియర్ న్యాయమవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తాము సీఆర్ జెడ్ 2లోనే నిర్మాణాలు చేశామని.. అది సీఆర్ జెడ్ 1 పరిధిలోకి రాదన్నారు. రాజకీయ కక్ష తోనే పిల్ దాఖలు చేశారన్నారు.

దీనిపై స్పందించిన హైకోర్టు.. సముద్రానికి అతి సమీపంలో ప్రహరీ నిర్మించారని.. నిర్మాణాల అనుమతులు.. ఇతర అంశాలను సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యంలో తెచ్చుకోవాలన్నారు. ఇక.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ.. నిర్మాణానికి సంబంధించి మొత్తం విస్తీర్ణానికి సంబంధించిన వివరాలు అడిగామని.. ఇప్పటివరకు నేహా రెడ్డి స్పందించలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా స్పందించిన హైకోర్టు.. స్టే లేని నేపథ్యంలో కూల్చేయాలని పేర్కొన్నారు. మరేం జరుగుతుందో చూడాలి.