కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే వుంటారు. నేచురోపతి, ఆయుర్వేద పంచకర్మ వైద్యం చేయించుకోనున్నారు. అంటే సెప్టెంబర్ 10 తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వస్తారు. ఇరవై రోజుల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సెలవు మీద వెళ్ళనున్నట్లు తెలిసి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 

పవన్ కళ్యాణ్ కొంత కాలంగా  తరచుగా ఏదో ఒక అనారోగ్యం బారినపడుతున్న సంగతి తెలిసిందే. దానికితోడు భుజం నొప్పి వేధిస్తుంది. దాంతో ముంబైలోని  కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో  జులై 11వ తేదీన ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్ పార్దివాలా బృందం ఆపరేషన్ చేశారు.

అయినా భుజం నొప్పి తగ్గలేదు. నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినప్పటికి ఆయన విధుల్లో పాల్గొంటున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భుజం నొప్పితో ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడంతో ఎట్ హోం ను రద్దు చేసుకొని కాకినాడ నుంచి హుటాహుటిన హైదరాబాద్ వెళ్లిపోయారు. 

దీంతో ఆయన ఆయుర్వేద వైద్యం వైపు మొగ్గుచూపారు. ఆయుర్వేద వైద్యంలో దేశంలో కేరళకు మంచి పేరున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీకి కూడా ఇక్కడి వైద్యం పట్ల నమ్మకమని చెబుతారు. అందుకే పవన్ కళ్యాణ్ కేరళంలో వైద్యం చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

అయితే ఈ ఇరవై రోజులు పవన్ కళ్యాణ్ బాధ్యతలు ఎవరు చూస్తారు అనే విషయం మీద చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తన పరిధిలోని మంత్రిత్వ శాఖ బాధ్యతలను సీనియర్ మంత్రి నాదెండ్ల మనోహర్ కు అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఇన్ని రోజులు రాష్ట్రానికి దూరంగా లేరు. కనుక ఇలాంటి సమస్య ఎదురుకాలేదు. ఇప్పుడు ఏమి చేస్తారు చూడాలి.