ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే సమయం వచ్చేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యూవస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన, అలాగే వైసీపీ నేతలు అనుసరిస్తున్న ‘హిట్ అండ్ రన్’ రాజకీయాలు ఏంటనే ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.
ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించి, డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ రాద్ధాంతం చేసే జగన్, నేరుగా శాసనసభకు వచ్చి ఆధారాలతో ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? సోమవారం నుంచి అసెంబ్లీలో డీఎస్సీపై సుదీర్ఘంగా చర్చే జరుగుతున్నా, సభకు హాజరుకాకుండా ముఖం చాటేయడం ఆయన భయానికి నిదర్శనం కాదా అని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సూటిగా నిలదీస్తున్నారు.
ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒంటరిగానైనా సభలో వైసీపీ సభ్యులను ఎరుర్కొన్నారు. కానీ నేడు జగన్ మాత్రం తనకున్న బలంతో సంబంధం లేకుండా, ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే సాకుతో అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నారని టీడీపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల మొదట్లోనే ఇంకా నాలుగు రోజులు మిగిలి ఉన్నందున, దమ్ముంటే సభకు రావాలని… తాము అడిగే ప్రతి ప్రశ్నకు నేనే స్వయంగా సమాధానం చెబుతానని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. అంతేకాకుండా, ఈ ఏడాదిలోనే మరో డీఎస్సీ ద్వారా మరో 3,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించి విపక్షానికి షాకిచ్చారు.
బయట పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, ఆరోపణలు చేసి వెంటనే ప్యాలెస్లో తలదాచుకోవడం వంటి ‘హిట్ అండ్ రన్’ విధానం వల్ల ప్రజల్లో నమ్మకం ఎలా ఏర్పడుతుంది? ఒకవేళ సభలో అధికార పక్షం ఇబ్బంది పెట్టినా, అక్కడి నుంచి వాకౌట్ చేసి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సానుభూతి పొందవచ్చు. కానీ సభకు రాకుండా కేవలం ఇగో సమస్యలతో, పాత అవమానాల భయంతో పారిపోతుంటే.. జనంలో జగన్ పాలిటిక్స్ పై తీవ్ర దురభిప్రాయం ఏర్పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా జగన్ ధైర్యం చేసి అసెంబ్లీకి వచ్చి తన వాదన వినిపిస్తారా? లేదా పాత పద్ధతే కొనసాగిస్తారా? వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates