వైసీపీకి బాలినేని రాజీనామా.. సుతిమెత్త‌ని ఉత్త‌రం!

వైసీపీలో మ‌రో కీల‌క వికెట్ ప‌డిపోయింది. సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయ‌న రాజీనామా చేస్తార‌న్న ఊహాగానాలు ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో మ‌రింత బ‌లంగా తెర‌మీదికి వ‌చ్చాయి.

ఎన్నిక‌ల స‌మ‌యంలో బాలినేని వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య తీవ్ర యుద్ధం చోటు చేసుకోవ‌డం, ఎన్నిక‌ల అనంత‌రం కూడా పార్టీ త‌ర‌ఫున ఆయ‌న‌కు స‌రైన ప్రాధాన్యం ద‌క్క‌లేద‌న్న భావ‌న వంటివి బాలినేనిని వైసీపీకి దూరం చేశాయి. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా రిజైన్ చేశారు.

అయ‌తే.. రాజీనామా లేఖ‌లో బాలినేని సుతిమెత్త‌ని వ్యాఖ్య‌ల‌తో త‌న అంత‌రంగాన్ని బ‌య‌ట పెట్టారు. “కొన్ని కార‌ణాల రీత్యా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నా. రాష్ట్రం ప్ర‌గ‌తి ప‌థంలో వెళ్తే ఖ‌చ్చితంగా రాజ‌కీయాల‌కు అతీతంగా అభినందిస్తాను.

దీనికి అంతిమంగా ప్ర‌జాశ్రేయ‌స్సే రాజ‌కీయాల‌కు కొల‌మానం క‌దా!. విలువ‌ల‌ను న‌మ్ముకునే 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా ప‌నిచేశాన‌న్న తృప్తి, కొంత గ‌ర్వం కూడా ఉంది. రాజ‌కీయాలు వేరు. బంధుత్వాలు. వైఎస్సార్ కుటుంబానికి స‌న్నిహితుడిని అయినా.. ఇప్పుడు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని రాజ‌కీయ నిర్ణ‌యాలు స‌రిగా లేన‌ప్పుడు ఖ‌చ్చితంగా అడ్డుకున్నా.ఎలాంటి మొహ‌మాటాల‌కు పోలేదు.

అంతిమంగా ప్ర‌జాతీర్పును హుందాగా తీసుకోవాల్సిందే. నేను ప్ర‌జానాయ‌కుడిని. ప్ర‌జాతీర్పే నాకు శిరోధార్యం. రాజ‌కీయాల్లో భాష గౌర‌వంగా, హుందాగా ఉండాల‌ని నిఖార్స‌యిన రాజ‌కీయం చేశా. కార‌ణం ల‌క్ష‌ల మంది మ‌న‌ల్ని ఆద‌ర్శంగా తీసుకున్న‌ప్పుడు అన్ని విధాలా విలువ‌ల‌ను కాపాడాల్సిన బాధ్య‌త మ‌న‌దే. రాజ‌కీయాల‌కు అతీతంగా ఏ పార్టీ వ్య‌క్తి నాద‌గ్గ‌ర‌కు వ‌చ్చినా స‌హాయం చేశా“ – అని బాలినేని త‌న రాజీనామాలో పేర్కొన్నారు.

కాగా.. వైసీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న బాలినేనికి తొలి కేబినెట్‌లోనే జ‌గ‌న్ మంత్రి ప‌దవిని అప్ప‌గించారు. అయితే. రెండోసారి మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేసిన‌ప్పుడు మాత్రం ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు. అప్పుడే బాలినేనికి వైసీపీకి మ‌ధ్య దూరం పెరిగింది. త‌ర్వాత‌.. సెక్యూరిటీ త‌గ్గింపు, జిల్లాలో రాజ‌కీయంగా ఆయ‌న‌ను ఒంట‌రి చేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

ఎన్నిక ల‌స‌మ‌యంలో ఒంగోలు పార్ల‌మెంటు స్థానాన్ని మాగుంట శ్రీనివాసుల రెడ్డికే ఇవ్వాలంటూ.. బాలినేని చేసిన ఫైట్ కూడా వృథా అయింది. ఇదేస‌మ‌యంలో ఎక్క‌డో తిరుప‌తికి చెందిన చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వ‌ద్ద‌న్నా.. జ‌గ‌న్ వినిపించుకోలేదు. దీంతో అప్ప‌టి నుంచి రాజుకున్న వివాదాలు.. ఇప్పుడు ఇలా.. రాజీనామా రూపంలో ఎండ‌య్యాయి. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.