‘జ‌గ‌న్ తెచ్చింది ఒక దిక్కుమాలిని జీవో’

గ‌త కొన్ని రోజులు ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం వివాదంగా మారింది. త‌న‌ హ‌యాంలో కేంద్రం నుంచి తీసుకువ‌చ్చిన మెడిక‌ల్ సీట్ల‌ను ఇప్పుడు కాదంటూ చంద్ర‌బాబు తిప్పిపంపుతున్నార‌ని.. ఇటీవ‌ల మాజీ సీఎం జ‌గ‌న్ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేశారు. మొత్తంగా 8 పాయింట్ల‌తో కూడిన ట్వీట్‌ను ఆయ‌న పోస్టు చేశారు. తాము ఎంతో క‌ష్ట‌ప‌డి మెడిక‌ల్ సీట్లు తెచ్చామ‌ని.. దీని వ‌ల్ల పేద‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని.. వైద్య క‌ళాశాల‌ల‌తోపాటు.. ఆసుప‌త్రులు కూడా అందుబాటులోకి వ‌స్తాయ‌ని.. రాష్ట్రంలోని పేద‌లు ఇక్క‌డే వైద్య విద్య‌ను చదువుకునేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు.

అయితే.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తాము గ‌తంలో ఇచ్చిన జీవోను కూడా ప‌క్క‌న పెట్టి వైద్య క‌లాశాల‌ల సీట్ల‌ను త‌మ‌కు అవ‌స‌రం లేదంటూ వెన‌క్కి పంపుతోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ఇదేం విధాన‌మ‌ని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల‌కు ముందు అన్ని వైద్య క‌ళాశాల‌ల‌ను నిర్మిస్తామ‌ని.. మ‌రిన్ని తీసుకువ‌స్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇలా చేయ‌డం స‌బ‌బేనా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం రాత్రి మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు.. జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై తీవ్రంగా స్పందించారు. జ‌గ‌న్ తెచ్చిన జీవో ఏంటి? అదొక దిక్కుమాలిని జీవో అంటూ నిప్పులు చెరిగారు.

అంతేకాదు.. ఆ జీవో ఆయ‌న చెవుల‌కే క‌ట్టి ఊరంతా తిప్పుతాన‌ని మండిప‌డ్డారు. “ఆయనొక(జ‌గ‌న్‌) జీవో ఇచ్చాడంట‌. ఆ జీవో ను ఆయన చెవుల‌కు కట్టి రాష్ట్రమంతా తిప్పుతా. సూటిగా అడుగుతున్నా, ఏం అమలు చేశాడో చెప్పమనండి. ఆయన ఏ జీవో ఇచ్చాడో, ఆ జీవోను మీడియా కూడా చదివి తెలుసుకోవాలి” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. నేర‌స్తుల మాట‌ల‌ను ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ న‌మ్మ‌ర‌ని.. ఇప్పుడే కాదు.. గ‌తంలోనూ అనేక అబ‌ద్ధాలు చెప్పార‌ని అన్నారు. ప్రైవేటు కాలేజీల విష‌యంలో ఆయ‌న తెచ్చిన జీవో చ‌దివితే.. ఎంత దుర్మార్గం ఉందో తెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు.

అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా..

రాక్ష‌సులు అన్ని యుగాల్లోనూ ఉన్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. త్రేతాయుగం, ద్వాపర యుగంలోనే రాక్ష‌సులు ఉన్నార‌ని అంద‌రూ చ‌దువుకున్నారు. వారిపై అధికారంలో ఉన్న పోరాటాలు చేయాల్సి వ‌చ్చింది. ఇప్పుడు క‌లియుగంలోనూ రాక్ష‌సులు ఉన్నారు. మేం మంచి చేస్తుంటే భ‌గ్నం చేయాల‌ని చూస్తున్నారు. ఇలాంటివారిపైనా పోరాడాల్సి వ‌స్తోంది. మ‌రింత గ‌ట్టిగా పోరాటం చేస్తాం. త‌గ్గేదే లేదు. ఎలా బుద్ది చెప్పాలో అలానే చెబుతాం అని వైసీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు అన్నారు.