‘చంద్రబాబు వద్దకు వెళితే నిన్ను కనబడకుండా చేస్తాం’

బాలీవుడ్ సినీ నటి కాదంబరి జెత్వానీ ఇష్యూతో తెర మీదకు వచ్చిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా.. విశాల్ గున్ని.. పీఎస్ఆర్ ఆంజనేయుల దందాలు లీలలు మామూలుగా లేవు.

వీరి వివాదాస్పద వైఖరి ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని తెలిపే పలు ఉదంతాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆ జాబితాలోకి చేరారు.

గత ప్రభుత్వ హయాంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని.. సీరియస్ వార్నింగ్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు. ఉద్యోగుల పట్ల నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాలపై పోరాడిన దానికి ఫలితంగా తనకు ఎదురైన బెదిరింపులు.. పోలీసు అధికారులు తనను టార్గెట్ చేసిన వైనాన్ని వివరించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సినీ నటి కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తున్న వైనాన్ని తమ సంఘం సమర్థిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తనకు వ్యక్తిగతంగా ఎదురైన పరిస్థితిని సూర్యనారాయణ వివరించారు. ‘ఉద్యోగుల పీఎస్ సొమ్మును గత ప్రభుత్వం ఇష్టానుసారం డ్రా చేసేస్తుందని గవర్నర్ కు కంప్లైంట్ చేశా. దాంతో నన్ను టార్గెట్ చేశారు. దొంగ కేసులు బనాయించారు. సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. సీఎస్.. డీజీపీలతో కలిసి కోర్టులో వాదించేలా రూ.25 లక్షలు ఖర్చు చేశారు” అని పేర్కొన్నారు. అంతేకాదు. ఈ ఇష్యూ తర్వాతి దశల్లో మరింత దారుణంగా మారిందని చెప్పుకొచ్చారు.

ఈ కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత పటమట పోలీస్ స్టేషన్ కు నన్ను పిలిపించారన్న సూర్యనారాయణ అప్పట్లో ఏం జరిగిందన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చదివితే.. ‘‘ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని నన్ను పిలిపించారు. అప్పటి నిఘా చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడించారు. చంద్రబాబు వద్దకు వెళితే నిన్ను కనబడకుండా చేస్తాం” అంటూ సూటిగా వార్నింగ్ ఇచ్చారంటూ అప్పట్లో చోటు చేసుకున్న పరిణామాలను రివీల్ చేశారు. సూర్యనారాయణ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.