జ‌గ‌న్‌కు ఇప్పుడు స‌ర్వం పెద్దిరెడ్డే ..!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికే వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ట్టంక‌ట్టారు. స‌ర్వం ఆయ‌న‌కే బాధ్య‌త‌లు అప్ప‌గించారు. తాజాగా జ‌రిగిన నియామ‌కాల్లో మొత్తం మూడు కీల‌క ప‌ద‌వుల‌ను పెద్దిరెడ్డికే అప్ప‌గించారు.

ఈ మూడు కూడా అత్యంత ప్రాధాన్యం ఉన్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం. పార్టీలో కీల‌క‌మైన రాజ‌కీయ స‌ల‌హా క‌మిటీ స‌భ్యుడిగా పెద్ద‌రెడ్డిని నియ‌మించారు. ఇది రాజ‌కీయంగా పార్టీ వేసే అడుగుల‌ను నిర్ధారించే క‌మిటీ కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ క‌మిటీలో చైర్మ‌న్‌గా జ‌గ‌న్ ఉంటారు. స‌భ్యుల‌ను నిర్ణ‌యించాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి పెద్దిరెడ్డికి అవ‌కాశం ఇచ్చారు. పార్టీ ప‌రంగా తీసుకునే నిర్ణ‌యాలు.. అభ్య‌ర్థుల విష‌యంలో వేసే అడుగులు వంటివి ఈ క‌మిటీకి కీల‌కం.

ఇక‌, ఈ ప‌ద‌వితోపాటు.. పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లా పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాలు కూడా అప్ప‌గించారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు గెలిచిన నేప‌థ్యంలో చిత్తూరు జిల్లాలో టీడీపీ దూకుడు ఎక్కువ‌గా ఉంది. అలాంటి స‌మ‌యంలో వైసీపీని పుంజుకునేలా చేయాల్సి ఉంది. దీంతో పెద్దిరెడ్డికి ఈ కీల‌క బాధ్య‌త అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, నాలుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా వైసీపీ అధ్య‌క్ష ప‌గ్గాల‌ను పెద్దిరెడ్డికే అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. వీటి లో తిరుప‌తి, చంద్ర‌గిరి, శ్రీకాళ‌హ‌స్తి, స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ నాలుగు స్థానాల్లో ఒక్క తిరుప‌తి మినహా మూడు చోట్ల టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది.

తిరుప‌తి అసెంబ్లీ స్థానాన్ని జ‌న‌సేన ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో పెద్దిరెడ్డి ఇక్క‌డ మ‌ళ్లీ వైసీపీని గాడిలో పెట్టాల్సి ఉంటుంది. అయితే.. ఈ నియోజ‌క‌వ‌ర్గాలు పెద్దిరెడ్డికి స‌వాల్‌గా మార‌నున్నాయ‌ని తెలుస్తోంది.

ఇదే స‌మ‌యంలో చంద్ర‌గిరిలో చెవిరెడ్డి పాత్ర తగ్గ‌నుంది. పైగా పెద్దిరెడ్డి అడుగు పెడితే.. ఆయ‌నకు న‌చ్చిన‌ట్టే ఉండాలి. గ‌తంలో న‌గ‌రిపై ఆయ‌న ప‌ట్టు ఉండేది. ఇది.. అప్ప‌టి ఎమ్మెల్యే రోజాకు సెగ పెట్టేందుకు ప‌నికి వ‌చ్చింది త‌ప్ప‌.. పార్టీని డెవ‌ల‌ప్ చేసేందుకు ప‌నికిరాలేదు.

ఇప్పుడు ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదేప‌రిస్థితి ఉంటుందా? లేక‌.. స్థానిక నాయ‌కుల‌తో క‌లిసి పెద్దిరెడ్డి ప‌నిచేస్తారా? అనేది చూడాలి. ఏదేమైనా.. పెద్దిరెడ్డికి పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ద్వారా.. సీమ‌పై ప‌ట్టు నిలుపుకొనేందుకు.. రెడ్డి వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే చెప్పాలి.