కాంగ్రెస్ ప్లాన్ ‘బి’ ఫలిస్తుందా ?

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. మొత్తానికి విజయవంతంగా 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. మిగిలిన 16 మందిని చేర్చుకునే విషయంలో అడుగులు ముందుకు పడడం లేదు.

ఈ నేపథ్యంలో పార్టి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసి, హైకోర్టును ఆశ్రయించింది. ముందుగా ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత అంశాన్ని నాలుగు వారాలలో తేల్చాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టుబడుతున్నది. 26 మంది చేరే అవకాశం లేదని తేలిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుండి కాపాడుకునేందుకు కొత్త ప్లాన్ తెరమీదకు తెచ్చింది. శాసనసభలో ఉన్న నిబంధన ప్రకారం ఏదైనా పార్టీ నుండి నాలుగో వంతు మంది సభ్యులు బయటకు వచ్చి తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరితే అనర్హత వేటు నుండి తప్పించుకునే అవకాశం ఉంటుందని, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. దానం నాగేందర్ ఏకంగా ఎంపీగా పోటీ చేయగా, పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ సలహాదారు పదవి దక్కింది. ఈ ఆధారాలు అన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో కీలకం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్లాన్ బి ఎంత వరకు ఫలిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.