ఆ ‘కోటి’ క‌దిలేదెప్పుడు?

బుడమేరు ముంపుకు విజయవాడ ప్రజలు లక్షలాది మంది నిరాశ్రయులైనా, కృష్ణా నది వరద ప్రవాహానికి వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునిగినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహా యం చేయ‌క‌పోవ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. బెజవాడ ముంపు కుటుంబాలకు రాష్ట్రాల సరిహద్దులు దాటి మానవీయ కోణంలో సినిమా స్టార్ట్ లు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, ఆధ్యాత్మిక సంఘాలు, సేవా సంస్థలు, ఎన్ ఆర్ ఐ లు అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి స్వయంగా విరాళాలు అందిస్తున్న విష‌యం తెలిసిందే.

వ‌ర‌ద ప్ర‌భావిత దృశ్యాలను టీవీల్లో చూసిన ప్ర‌తి ఒక్క‌రూ క‌దిలిపోయారు. మేమున్నాంటూ.. చిన్నా పెద్దా అంద‌రూ సాయం చేశారు. వీరిలో పాఠ‌శాల విద్యార్థులు కూడా ఉన్నారు. త‌మ‌కు ఇచ్చిన పాకెట్ మ‌నీని కూడా చిన్నారులు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌ల‌కు విరాళంగా అందించారు. మ‌రి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏం చేశార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. జగన్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అధికార పార్టీ నాయ‌కులు దెప్పిపొడుస్తున్నారు.

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో తొలిరోజు ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. రూ.కోటి విరాళం ప్ర‌క‌టించారు. అయితే.. ఈ సొమ్ముల‌ను ఇంకా విడుద‌ల చేయ‌క‌పోవ‌డం.. వాటిని ఎవ‌రికీ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పోనీ.. ఒక‌వేళ ఇచ్చి ఉంటే.. ఆ లెక్క‌లైనా చెప్పాలి. లేదా.. అనుకూల మీడియాలో అయినా ప్ర‌చురించి ఉండాలి. కానీ, అలా కూడా చేయ‌లేద‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. “కోటి రూపాయలు ప్రకటించి, వాటిని ఎలా ఇవ్వాలో పార్టీలో చర్చించి ఇస్తామని చెప్పటం విడ్డూరంగా ఉంది. తాను రూపాయి ఇవ్వకపోగా, కనీసం ప్రతి పక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విపత్తుకు సంబందించి ఆదుకోవాలని అడగనూ లేదు, లేఖ కూడా రాయనూ లేదు” అని టీడీపీనేత‌లు ఆరోపించారు.

ఇలాంటి వైఖరితో ఉన్న జ‌గ‌న్‌.. ముంపు బాధితులను పరామర్శించినా, పరామర్శించక పోయినా ఒక్కటే అని నాయ‌కులు అభిప్రాయపడుతున్నారు. 151 సీట్లు ఉన్న పార్టీ 11 సీట్లు వచ్చినా ‘ఏంరా బాలరాజు’ అన్నట్లు మారకపోతే ఎలా? ప్రశ్నించారు. రాజ్య సభ లో 11 మంది, లోక్ సభ లో 4 ఉండి లాభమేంటి? అని ఎద్దేవా చేస్తున్నారు. ఆ కోటి సంగ‌తేంటి? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి జ‌గ‌న్ ఏం స‌మాధానం చెబుతారోచూడాలి.