రంగంలోకి ఆర్మీ.. బుడ‌మేరు గండ్ల పూడ్చివేత‌: కేంద్ర మంత్రి

ఏపీలో బ‌డుమేరు స‌హా కృష్ణాన‌ది వ‌ర‌ద ప్ర‌భావంతో మునిగిపోయిన ప్రాంతాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే.. ఎంత చేసినా.. బుడ‌మేరు ముంపు బాధితుల‌కు స‌రైన విధంగా సాయం అంద‌డం లేదు. దీంతో కేంద్రం స‌హ‌క‌రించాల‌ని చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపుతో కేంద్ర మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. బుడ‌మేరు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఆయ‌న సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు. బాధిత ప్రాంతాల‌ను గ‌గ‌నం నుంచే ప‌రిశీలించారు. అనంత‌రం.. విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్‌లో మీడియాతో మాట్లాడిన చౌహాన్‌.. గత జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల వ‌ల్లే బుడ‌మేరు పొంగింద‌ని చెప్పారు.

“బుడ‌మేరు ఈ స్థాయిలో పొంగి వ‌ర‌ద‌లు రావ‌డానికి గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పులే ఉన్నాయి. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో బుడ‌మేరును ఆక్ర‌మించుకుని నిర్మాణాలు చేశారు. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌వాహానికి అడ్డు ఏర్ప‌డింది. దీంతో నీరు దిగువ‌కు ప్ర‌వ‌హించ‌డం లేదు. నేను స్వ‌యంగా చూశా. ఈ అడ్డును తొల‌గించాల్సి ఉంది. అదేవిదంగా గండ్లు పూడ్చాల్సి ఉంది. గండ్లు ప‌డ‌డానికి కూడా. ఆక్ర‌మ‌ణ‌లే కార‌ణం. గ‌తం ప్ర‌భుత్వం స‌రిగా స్పందించి ఉంటే.. ఇంత న‌ష్టం జ‌రిగి ఉండేది కాదు” అని చౌహాన్ వివ‌రించారు. ఇదేస‌మ‌యంలో ఏపీని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వ‌స్తుంద‌ని తెలిపారు.

ముఖ్యంగా బుడ‌మేరుకు ఏర్ప‌డిన గండ్లు పూడ్చేందుకు త‌క్ష‌ణ‌మే ఆర్మీని రంగంలోకి దింప‌నున్న‌ట్టు కేంద్ర మంత్రి చౌహాన్ వివ‌రించారు. త‌క్ష‌ణ సాయం కింద కేంద్రం ఆదుకుంటుంద‌ని తెలిపారు. సీఎం చంద్ర‌బాబు వ‌ర‌ద ప్ర‌భావిత ప్ర‌జ‌ల‌ను ఆదుకునేం దుకు ఎంతో శ్ర‌మిస్తున్నార‌ని కితాబునిచ్చారు. ఆయ‌నే స్వ‌యంగా వ‌ర‌ద నీటిలో దిగి బాధితుల‌ను ఓదార్చుతున్నార‌ని ఇలా ఒక ముఖ్య‌మంత్రి స్వ‌యంగా వ‌ర‌ద నీటిలో ఇన్ని రోజులు తిర‌గ‌డం గ‌తంలో త‌న‌కు ఎప్పుడూ తెలియ‌ద‌ని వ్యాఖ్యానించారు. దగ్గరుండి మరీ సహాయక చర్యలు పర్యవేక్షించారని కితాబిచ్చారు.

బాధితుల‌కు ఆహారం అందించేందుకు సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను కూడా వినియోగించుకోవ‌డం గొప్ప విష‌య‌మ‌ని డ్రోన్ల‌కు సంబంధించిన విష‌యాన్ని కేంద్ర మంత్రి ప్ర‌స్తావించారు. ఏపీలో జ‌రిగిన న‌ష్టం.. విప‌త్తును ప్ర‌ధాని మోడీకి వివ‌రించ‌నున్న‌ట్టు తెలిపారు. సాయం త్వ‌ర‌గా అందేలా.. బాధితుల‌కు ఊర‌ట ల‌భించేలా చేస్తామ‌ని చెప్పారు.