ఇలా అడ్డంగా దొరికిపోతున్నారేంటి రోజా?

మనసుకు తోచినట్లుగా మాట్లాడే లగ్జరీ సామాన్యుడికి ఉంటుంది. ఎంత తోపు రాజకీయ నాయకులకైనా అలాంటి సౌకర్యం ఉండదు. ఎందుకంటే ఒక నాయకుడిగా, నాయకురాలిగా ఉన్నప్పుడు వారి మీద అంతో ఇంతో బాధ్యత ఉంటుంది. మాజీ మంత్రి కం మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇలాంటి విషయాల్ని పూర్తిగా మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది.

అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తూ.. లిమిటెడ్ గా రియాక్టు అవుతున్న రోజా.. బెజవాడ వరదలపై స్పందించాలని డిసైడ్ అయ్యారు. అదేమీ తప్పు కూడా కాదు.కానీ.. అలా స్పందించే వేళలో.. గ్రౌండ్ లెవల్ లో ఏం జరుగుతుంది? తెలుసుకుని మాట్లాడాలి. అందుకు భిన్నంగా పార్టీ కరపత్రాన్ని భగవద్గీతగా భావించి.. దాన్ని చదివిన తర్వాత తన మనసుకు తోచింది యాడ్ చేసుకుంటూ చెలరేగిపోతే.. మొదటికే మోసం వస్తుంది. ఆ విషయాన్ని ఆర్కేరోజా మిస్ అయినట్లున్నారు.

విజయవాడ వరదల మీద మంత్రి నారా లోకేశ్ పాల్గొనటం లేదని.. హైదరాబాద్ లో ఉండి ఎంజాయ్ చేస్తున్నట్లుగా నోరు పారేసుకున్నారు. ఆమె వ్యాఖ్యలు అలా బయటకు వచ్చాయో లేదో.. జనాలు ఆమెను తిట్టి పోస్తున్న పరిస్థితి. కళ్లకు ఏమైందంటూ మొదలు పెట్టి.. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

నిజానికి బెజవాడ వరదలు మొదలైన నాటి నుంచి లోకేశ్ అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారు. కాకుంటే.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ అతిగా ఫోకస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించకుండా తొందరపాటుతో రోజా వ్యవహరించిన తీరు విమర్శలు వెల్లువెత్తేలా చేస్తోంది. ఇప్పటికైనా ఏదైనా మాట్లాడే ముందు.. అసలేం జరిగిందన్న ఆరా కనీసస్థాయిలో అయినా చేస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా ఎవరు చెబుతారు?

ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆమె మాటలోనూ.. వ్యవహార శైలిలోనూ మార్పులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎదుటోడు చీమ కంటే చిన్నోడన్నట్లుగా చూసిన దానికి ఆమె భారీగానే మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఏపీ రాజకీయాలపైనా.. రోజు వారీ పరిణామాల మీద స్పందించటం తగ్గించేశారు. అంతేనా.. నోరు విప్పితే.. జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే రోజా.. ఇప్పుడు ఆయన ప్రస్తావన తీసుకురావటానికి సైతం జంకుతున్నారు. ఇదంతా చూసినోళ్లు.. ఎలాంటి రోజా ఎలా అయిపోయారన్న భావనకు గురయ్యే పరిస్థితి.