అమరావతి పై కీలక వ్యాఖ్యలు చేసిన చిన్నమ్మ

ఏపీ రాజధానిగా అమరావతిపై బీజేపీ స్టాండ్ ఏమిటి? అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఓవైపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించే సోము వీర్రాజు ఏమో.. ఏపీ రాజధాని అమరావతినే అని చెబుతారు. మరోవైపు రాజధాని అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసే వేళలో ఏపీ రాష్ట్రానికే ఆ నిర్ణయాధికారం అని చెప్పటం.. ఈ డబుల్ స్టాండ్ ఏమిటన్న దానిపై భారీగా చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. జాతీయ స్థాయిలో పార్టీని పునర్ వ్యవస్థీకరించిన బీజేపీ అధినాయకత్వం ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి అలియాస్ చిన్నమ్మకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాను కట్టబెట్టేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు.

అమరావతిపై బీజేపీది డబుల్ స్టాండ్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. అమరావతిపై ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసేలా ఆమె తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. పార్టీకి రెండు నాల్కుల ధోరణి లేదని.. అమరావతిలోనే రాజధాని ఉండాలని పార్టీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసిందని.. కాకుంటే కేంద్ర ప్రభుత్వ పాత్ర పరిమితంగా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు.

తనకు లభించిన పదవిని బాధ్యతగా పరిగణిస్తున్నా అని చెప్పిన ఆమె.. దక్షిణాదిన పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు చెప్పారు. కర్ణాటకలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని.. తెలంగాణ.. ఏపీ.. తమిళనాడులోనూ ప్రాంతీయ పార్టీలకు ధీటుగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అమరావతిపై భిన్నాభిప్రాయాలకు తావు లేదని చెప్పారు.

పార్టీ పరంగా రాజధాని అమరావతిలోనే ఉండాలని తాము చెబుతున్నామని.. రైతులకు న్యాయం జరగాలని.. వారు స్థలాలు ఇచ్చిన చోట డెవలప్మెంట్ జరగాల్సిందేనని.. అందులో భిన్నాభిప్రాయాలకు చోటు లేదన్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందున ఎక్కువ చర్చకు తావులేదన్నారు. మొత్తంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో అమరావతి ఏపీ రాజధానిగా కొనసాగించాలన్న చిన్నమ్మ వ్యాఖ్యలు అక్కడి వారికి కొంత ఊరటను ఇవ్వటం ఖాయం.