మంత్రి స‌త్య‌కుమార్‌కు కొత్త చిక్కు వ‌చ్చి ప‌డిందే..?

బీజేపీ రాష్ట్ర మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు కొత్త చిక్కు వచ్చింది. పార్టీ ప‌రంగా కంటే.. మంత్రిత్వ శాఖ ప‌రంగా ఆయ‌న స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. బీజేపీ నాయ‌కుడు కావ‌డం.. పైగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నేప‌థ్యంలో స‌త్య‌కుమార్ ఓ కీల‌క విష‌యంలో చిక్కులు ఎదుర్కొన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అదే ఆయుష్మాన్ భార‌త్‌. దీనిని కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

అంతేకాదు.. బీజేపీ పాలిత‌, లేదా ఎన్డీయే కూట‌మి పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లోనూ ఆయుష్మా భార‌త్ కార్డుల‌ను పెంచాల‌ని కేంద్రంలోని మోడీ స‌ర్కారు ల‌క్ష్యంగా పెట్టింది. ఇది.. కూట‌మి పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీ వంటి బ‌హుళ కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్న రాష్ట్రంలో మాత్రం ఇబ్బందిగా ఉంది. ఇప్ప‌టికే.. ఏపీ ప్ర‌జ‌లు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కానికి అల‌వాట‌య్యారు. వారికి ఏ చిన్న అనారోగ్యం క‌లిగినా.. ఆరోగ్య శ్రీని వాడుకుంటున్నారు.

పైగా.. జ‌గ‌న్ హ‌యాంలో ఈ ప‌థ‌కం కింద‌.. మ‌రిన్ని కేసులు కూడా చేరాయి. దీంతో ఇది పేద‌ల‌కు చాలా వ‌ర‌కు అందివ‌చ్చిన ప‌థ‌కంగా పేరు తెచ్చుకుంది. ఎన్నిక‌ల‌కు ముందు దీని ప‌రిమితిని రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచారు. దీనిని అనేక మంది పేద‌లు కూడా వినియోగించుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ ప‌థ‌కాన్ని ఎత్తేయాల‌న్న‌ది కేంద్రం నుంచి త‌మ నాయ‌కుడు, మంత్రి స‌త్య‌కుమార్ పై పెరుగుతున్న ఒత్తిడిగా చెబుతున్నారు. అంతేకాదు.. ఆయుష్మాన్ భార‌త్ ను అమ‌లు చేయాల‌ని కూడా చెబుతున్నారు.

ఇక‌, ఆరోగ్య శాఖ విష‌యంలో సీఎం చంద్ర‌బాబు పూర్తి బాధ్య‌త‌ల‌ను మంత్రి స‌త్య‌కుమార్‌కే ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆరోగ్య శ్రీ స్థానంలో ఆయుష్మాన్ భార‌త్‌ను అమ‌లు చేయాల‌ని చూస్తున్నారు.కానీ ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే వ్య‌తిరేక‌త ఎలా ఉంటుంద‌నే విష‌యంపైనే త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రోవైపు.. ఆరోగ్య శ్రీలో 25 ల‌క్ష‌ల వ‌రకు వైద్య స‌దుపాయం ఉంటే.. ఆయుష్మాన్ భార‌త్‌లో రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కే ఉంది. ఇదిప్ర‌జ‌లు హ‌ర్షించే అవ‌కాశం లేదు. ఈ ప‌రిణామాల‌తోనే స‌త్య‌కుమార్ కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నార‌ని అంటున్నారు. చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి.