సిసోడియాకు బెయిల్.. ఇక‌, క‌విత వంతేనా?

ఢిల్లీలో వెలుగు చూసిన మ‌ద్యం కుంభ‌కోణానికి సంబంధించి దాదాపు 17 మాసాలుగా జైల్లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాకు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఇదే కేసులో ఈ ఏడాది మార్చి నుంచి జైల్లో ఉన్న‌ బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌విత‌కు కూడా ఊర‌ట ల‌భించ‌నుందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే..సిసోడియా కేసును సాగ‌దీయాల‌న్న ఉద్దేశం క‌నిపిస్తోంద‌ని సీబీఐ, ఈడీల‌కు సుప్రీంకోర్టు చుర‌క‌లు అంటించింది.

త‌న కేసును త్వ‌ర‌గా విచార‌ణ చేయ‌మ‌ని కోరే హ‌క్కు సిసోడియాకు రాజ్యాంగ బ‌ద్ధంగా ద‌ఖ‌లు ప‌డింద‌ని తెలిపింది. విచార‌ణ పేరుతో ఓ అనుమానితుడిని ఎంతో కాలం జైల్లో ఉంచ‌లేర‌ని వ్యాఖ్యానించింది. దీనికి సుప్రీంకోర్టు ఎట్టి ప‌రిస్థితిలోనూ రాజీ ప‌డ‌బోద‌ని న్యాయ‌మూర్తులు వ్యాఖ్యానించారు. అయితే.. శుక్ర‌వారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా.. సీబీఐ న్యాయ‌వాదులు మాట్లాడుతూ.. సిసోడియాను తిరిగి ట్ర‌య‌ల్ కోర్టుకు పంపించాల‌ని.. అక్క‌డ విచార‌ణ చేసి.. బెయిల్ ఇవ్వాలో వ‌ద్దో నిర్ణ‌యిస్తారని తెలిపారు.

దీనిపై సుప్రీంకోర్టు మండిప‌డింది. ట్రయల్ కు పంపడమంటే సిసోడియాతో వైకుంఠపాళీ ఆడించినట్లేనని ఒకింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలా చేయ‌డం సిసోడియాకు ద‌ఖ‌లు ప‌డే ప్రాథ‌మిక హ‌క్కుల‌తో ఆడుకోవ‌డ‌మేన‌ని న్యాయ‌మూర్తులు తెలిపారు. బెయిల్ ఇవ్వ‌కుండా ఉండేందుకు ఎలాంటి కార‌ణాలు క‌నిపించ‌డం లేద‌న్నారు. బెయిల్ ఇవ్వక‌పోవ‌డం అంటే.. అనుమానితుడిని శిక్ష ప‌డ‌కుండా ముందే శిక్షించ‌డం వంటిద‌ని పేర్కొన్నారు. దిగువ కోర్టులు ఈ విస‌యాన్ని మ‌రిచిపోవ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు.

క‌విత‌కు ఇదే ఊత‌మా!

ఇక‌, బీఆర్ఎస్ అధినేత కుమార్తె క‌విత కూడా ఇదే కేసులో తీహార్ జైల్లో ఉండ‌డం.. ఇప్ప‌టికే ఆరు సార్లు బెయిల్ కోసం ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన నేప‌థ్యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ.. సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య‌లు క‌విత‌కు ఊతంగా మారే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ప్రాథ‌మిక హ‌క్కుల గురించి సుప్రీం పేర్కొన్న నేప‌థ్యంలో క‌విత‌కు కూడా బెయిల్ వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.